KCR: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్కి చేరిందా? సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్, ఐఏఎస్ల విచారణలో ఏం తేలింది? అందరి వేళ్లు అప్పటి ప్రభుత్వ పెద్దల వైపు చూపించాయా? కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలని సిట్ డిసైడ్ అయ్యిందా? ఆయన్ని విచారించి నివేదిక సుప్రీంకోర్టుకి ఇవ్వనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
చివరి అంకానికి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకానికి చేరింది. ఈ కేసు నిమిత్తం డీజీపీ.. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన అంశాల వైపు వెళ్లకుండా, మిగతా వాటిపై దృష్టి పెట్టారు అధికారులు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్న అధికారులను సిట్ విచారించింది.
ఇప్పుడు అధికారుల వైపు దర్యాప్తు పూర్తి కావడంతో ఇక రాజకీయ నేతల వంతైంది. అటువైపు సిట్ ఫోకస్ చేసినట్టు అంతర్గత సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నేతలున్నట్లు తెలుస్తోంది.
ఫైనల్ టచ్గా కేసీఆర్, విచారణ తర్వాతే నివేదిక
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, సీనియర్ నేత హరీష్రావులకు నోటీసులు ఇస్తారనే ప్రచారం లేకపోలేదు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. సమావేశాల తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలకు సిట్ నోటీసులు ఇవ్వనుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారిని విచారించిన తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలని భావిస్తోందట.
నోటీసుల వ్యవహారంపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్రావు మీడియా చిట్ చాట్లో కొన్ని విషయాలు బయటపెట్టారు. ఈ కేసులో తమకు నోటీసులు ఇస్తారనే సమాచారం ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారమని, ఇప్పుడే అదే జరుగుతుందని అన్నారు. ఈ లెక్కన విచారణకు అప్పటి ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన ప్రభాకర్రావు కస్టడీ, నిజాలన్నీ పెన్డ్రైవ్లో
నేతలను విచారించిన తర్వాత జనవరి రెండోవారం దాటిన తర్వాత సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వనుంది సిట్. న్యాయస్థానం ఈ కేసు నివేదిక పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు కావడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చెబుతుందా? లేకుంటే సీబీఐకి అప్పగిస్తుందా? అనేది తేలనుంది. మొత్తానికి ఎటు చూసినా వచ్చే ఏడాది కూడా బీఆర్ఎస్ నేతలకు కష్టాలు తప్పవని అంటున్నారు కొందరు నేతలు.