హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ పనుల పురోగతిని సీఎంకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పునరుద్ధరించిన చెరువుల వద్ద జనవరి 11, 12, 13 తేదీలలో ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సూచించారు.
తిరుపతిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హోంమంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం పాల్గొననున్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్కు మాట్లాడే అర్హత లేదన్నారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహి అన్నారు. 2014లో జగన్, కేసీఆర్కు మధ్య ముడుపుల బిజినెస్ జరిగింది అన్నారు. కేసీఆర్ 299 టీఎంసీల ఒప్పందం వెనుక ఉన్న .. కుట్రలు బయటకు రావాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జగన్, కేసీఆర్ మధ్య అంతర్గత ఒప్పందం కాదు.. బహిరంగ ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
మేడారం జాతర పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చే భక్తులకోసం పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన ఆలయం చుట్టూ రాతి ప్రాకార నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ డైవర్షన్ పై ఎస్పీ రామ్నాథ్ తో కలిసి జంక్షన్లను పరిశీలించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వం వైపు వెళ్లడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. అభివృద్ధి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో కలిసి ఉండటం వల్లే జగిత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నానని.. నియోజకవర్గ ప్రయోజనాలే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాళేశ్వరంతో యాదాద్రికి చుక్క నీరు రాలేదన్నారు. ఆలేరు, భువనగిరిలో ఎకరా కూడా తడవలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కోట్లు వెచ్చించి కట్టారు కానీ.. వేల ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయారని విమర్శించారు. లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని బీఆర్ఎస్ చెప్పుకోవడంపై మండిపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా సరసనపల్లిలో నూతనంగా నిర్మించిన చర్చిని మంత్రి సీతక్క ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆమె, పేదలకు బట్టలు పంపిణీ చేశారు. చర్చిల మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేశారని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు రైతుగా మారి సందడి చేశారు. క్రిస్మస్ సెలవులో పశ్చిమ గోదావరి జిల్లా ఆగర్తిపాలెంలోని తన పొలంలో ట్రాక్టర్తో దుక్కు దున్ని, వ్యవసాయ పనులు చేశారు. తీరిక దొరికినప్పుడు రైతు కష్టాన్ని తెలుసుకోవడం తనకు తృప్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి నిరాడంబరతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష, ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ, ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసుకున్నారు. గంజాయి వ్యాపారం, నిధుల మంజూరుపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి.
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్.. మంత్రి పొన్నం ప్రభాకర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు, ఆలోచనలను మంత్రితో పంచుకున్నారు. సినీ రంగ ప్రముఖులు రాజకీయ నాయకులను కలిసి నగర పురోభివృద్ధిపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భద్రాచలంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు కేంద్ర భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న రామయ్యను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను కేంద్ర బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తిరుపతి అలిపిరి వద్దనున్న టీటీడీ గోశాలను సందర్శించి అక్కడ గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆయనకు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు స్వాగతం పలికారు. తర్వాత ఆయన గోవులకు పూజలు చేసి వాటికి పశుగ్రాసాన్ని అందించారు. సమర్థవంతంగా గోశాల నిర్వహిస్తున్నారని ఆయన అక్కడున్న విజిటర్స్ పుస్తకంలో రాశారు.
చలి తీవ్రతకు రెండు తెలుగు రాష్ట్రాలు గజగజా వణుకుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో.. వీధుల్లో జనం కనిపించడం లేదు. ఉదయం 8 గంటల వరకు తెల్లవారు వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు అదిలాబాద్, ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి.
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంచు దుప్పటి కప్పేసింది. చలితీవ్రతకు ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం స్తంభించింది. రహదారులపై మంచు వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతుండగా, వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం.. స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్కు ఊతమివ్వడం అత్యవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇండియన్ డిఫెన్స్ ఎకౌంట్స్ సర్వీసు అధికారుల బృందం రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిశారు. కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక విశ్లేషణ వంటి ఆధునిక నైపుణ్యాలు నేర్చుకోవాలని వారికి సూచించారు.
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్ట్ల మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికేతో సహా ఆరుగురు మావోలు మృతి చెందారు. ఈ ఘటన కంధమాల్ జిల్లా బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఒడిషాలోని కంధమాల్ ఎన్కౌంటర్పై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సల్స్ రహిత భారతదేశం దిశగా ఈ ఘటన ఓ కీలక మైలురాయంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కంధమాల్లో జరిగిన భారీ ఆపరేషన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్తోపాటు ఆరుగురు నక్సల్స్ హతమైనట్లు వెల్లడించారు. 2026 మార్చ్ 31లోగా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
భారత రక్షణశాఖ మరో కీలక ప్రయోగం చేసింది. ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్ INS అరిఘాత్ నుంచి అత్యాధునిక న్యూక్లియర్ మిసైల్ అయిన K-4ను విజయవంతంగా పరీక్షించింది. విశాఖ సాగర తీరంలోని బంగాళాఖాతం ఈ ప్రయోగానికి వేదికైంది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను రక్షణశాఖ అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రయోగాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలయికలో సినిమా ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్పై నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన అల్లు అర్జున్ను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్లో కలిసి కథని వినిపించారు.
భారత హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్ పేరును క్రీడా అవార్డుల సెలక్షన్ కమిటీ.. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు కోసం సిఫారసు చేసింది. ఈ ఏడాది భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి కమిటీ అతడి పేరుని ప్రతిపాదించింది.