School Complaint Portal: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వ్యవహారాలు, విద్యార్థులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలపై తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులకు ఇక సులభంగా పరిష్కారం లభించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించేందుకు ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ను(పీఎస్ సీఎంఎస్) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లు, పాఠశాల నిర్వహణ తీరు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఫిర్యాదు చేయాలంటే తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులను సంప్రదించాల్సి వచ్చేది. ఒక్కోసారి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు వెనక్కి తగ్గేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేలా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫిర్యాదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో టెక్నో, ఒలంపియాడ్, స్మార్ట్ క్లాస్, ప్రత్యేక శిక్షణ, ఇతర కార్యక్రమాల పేర్లతో అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. పాఠశాల ఫీజుతో పాటు వివిధ పేర్లతో అదనపు చార్జీలు విధించడం, ఫీజుల వివరాలను స్పష్టంగా వెల్లడించకపోవడం, నిర్దేశిత నిబంధనలను పాటించకపోవడం వంటి అంశాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులను కూడా కొత్త వ్యవస్థ ద్వారా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు.
అదేవిధంగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు, తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోయినా ఫిర్యాదు చేయవచ్చని విద్యాశాఖ స్పష్టంచేసింది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలు, పాఠశాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన, తల్లిదండ్రులపై అనవసర ఒత్తిడి వంటి సమస్యలను కూడా సంబంధిత విభాగం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడనుంది.
మరోవైపు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉండటంతో తల్లిదండ్రులకు సమయం, శ్రమ ఆదా కానుంది. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత దాని పురోగతిని పర్యవేక్షించే అవకాశం కూడా ఉండటంతో సమస్య ఎక్కడ పెండింగ్లో ఉందో తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేసిన తల్లిదండ్రులు కూడా ఇకపై తమ సమస్యలను నేరుగా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ పోర్టల్ ద్వారా ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఫిర్యాదులను అధికారులు ఎంత వేగంగా పరిష్కరిస్తారన్నదే ఈ కొత్త వ్యవస్థ విజయాన్ని నిర్ణయించనుంది. ఫిర్యాదులపై సమయపాలనతో స్పందించి, తప్పిదాలు చేస్తున్న పాఠశాలలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే ఈ పోర్టల్ తల్లిదండ్రులకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది.
Also Read: మంత్రి సురేఖ ఎపిసోడ్.. సీఎం రేవంత్ సైలెన్స్ వెనుక పెద్ద స్కెచ్ ఉందా?
పేరెంట్స్, స్టూడెంట్లతోపాటు సామాన్య ప్రజలు ఎవరైనా ప్రైవేట్ స్కూళ్లపై ఉన్న ఫిర్యాదులను ఈ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. స్కూల్ ఎడ్యుకే షన్ డైరెక్టరేట్ వెబ్ సైట్ schooledu.telangana.gov.in లోకి వెళ్లి ‘ఆన్ లైన్ సర్వీ సెస్’ సెక్షన్లో పీఎస్ సీఎంఎస్ లింక్ క్లిక్ చేస్తే అక్కడ తమ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి తమ సమస్యను వివరంగా రాసి, అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్ లోడ్ చేయొచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ఒక ‘గ్రీవెన్స్ ఐడీ’ వస్తుంది. దీని ద్వారా లేదా మీ మొబైల్ నంబర్ ఉపయోగించి మీ ఫిర్యాదు ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని కూడా విద్యాశాఖ కల్పించింది.
Also Read: రేణిగుంటకు 164 ఏళ్లు.. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉందా?