Training Program: సర్పంచులు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నది. మార్చి 31లోగా కంప్లీట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చే అధికారులకు (ట్రైనర్స్) ముందుగా రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తరగతులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేశారు. 2018 పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు తెలియాలని, చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహించేలా సర్పంచులను, వార్డు సభ్యులను సన్నద్ధం చేసే బాధ్యత ట్రైనర్లదేనని సూచించారు.
ప్రతి జిల్లా నుంచి నలుగురు జిల్లా, మండల స్థాయి అధికారులతోపాటు 25 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని, ఈ నెల 13వ తేదీలోగా ట్రైనింగ్ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ట్రైనర్లు రాష్ట్రంలోని 12,769 మంది సర్పంచులు, సుమారు 1.11 లక్షల మంది వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 31లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు జిల్లా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్టివెన్ నీల్, జేడీ (ట్రైనింగ్) ప్రసూనా రాణి, యాదాద్రి భువనగిరి ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Amardeep: అమర్దీప్ కి రవితేజ స్పెషల్ గిఫ్ట్.. ఏంటంటే?