Amit Shah: స్వేచ్చ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 26న కరీంనగర్కు వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనలో ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అమిత్ షా పర్యటనకు ముందే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న అభయ్ పాటిల్ ఇప్పటికే పలువురు ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించి, పార్టీ కార్యక్రమాల్లో అందరూ సమన్వయంతో ముందుకు సాగేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంకేతాలు ఇటీవల స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు వరుసగా రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రాష్ట్రానికి రాగా, అనంతరం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, మన్సూఖ్ మాండవీయ తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు తెలంగాణను కీలక కేంద్రంగా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దక్షిణాది రాజకీయాల్లో మరింత బలమైన పునాదులు వేసే వ్యూహంలో భాగంగానే వరుసగా జాతీయ నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
Also read: Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు
టీజీజేపీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వరుసగా పలువురు కీలక నేతలతో సమావేశమవుతూ నేతల సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర బీజేపీలో ఏ ఇద్దరు కీలక నేతల మధ్య మనస్పర్థలు లేదా భేదాలు ఉన్నా, వాటిని వెనువెంటనే పరిష్కరించి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్ఠానం అభయ్ పాటిల్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధం చేసిన ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి.
నేతలందరూ వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి, కలిసికట్టుగా పని చేసేలా ఇన్చార్జీ గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేపట్టిన కొద్ది రోజులకే కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో కరీంనగర్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. రాష్ట్ర బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, నాయకుల మధ్య సమన్వయం, సంస్థాగత బలోపేతంపై ఆయన కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అమిత్ షా పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!