Instagram Assault: స్వేచ్ఛ బ్యూరో: ఆన్లైన్ తరగతుల పేరుతో పిల్లల చేతికి ఇస్తున్న స్మార్ట్ఫోన్లు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో హెచ్చరించే సంఘటన ఇది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 14 ఏళ్ల బాలికకు చదువు కోసం తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన అతను, 2021 మే 25న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో, అసలు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వెంటనే కామాటిపురా పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. సమగ్రంగా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన 12వ అదనపు సెషన్స్ న్యాయమూర్తి అర్చన కుమారి నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు.
ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేలా కోర్టులో వాదనలను సమర్థవంతంగా వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసిన ఏసీపీ భిక్షంరెడ్డి, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించిన లీగల్ సపోర్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి, ప్రాసెస్ కానిస్టేబుల్ విఘ్నేష్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాకపోకలు బంద్!