Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఫోల్ మేనేజ్మెంట్ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా గాంధీభవన్ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. ఈ రెండు నగరాల్లో పాగా వేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తన పట్టును నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ భావిస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కాంగ్రెస్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ‘పోల్ మేనేజ్మెంట్’పై పక్కాగా ఫోకస్ పెట్టింది. ఇందుకోసం గాంధీభవన్ నుంచి స్పెషల్ టీమ్స్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఎన్నికల పర్యవేక్షణ కోసం గాంధీభవన్ నుంచి మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఓ నేత తెలిపారు. ఈ టీమ్లు నేరుగా క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు నివేదికలను అధిష్టానానికి పంపిస్తాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతల మధ్య సమన్వయం కుదర్చడం వంటి వాటికి ఓ టీమ్,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకర్షించడం మరో టీమ్, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను పసిగట్టి, అందుకు తగ్గట్టుగా ఓటర్లు ఛే జారి పోకుండా మరో టీమ్ పనిచేస్తుందని గాంధీభవన్ లోని ఓ నేత తెలిపారు.
ఈ రెండు కార్పొరేషన్లు కాంగ్రెస్కు రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకం.నిజామాబాద్ ను పరశీలిస్తే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు, వ్యాపార వర్గాల మద్దతు కూడగట్టడం కాంగ్రెస్కు అనివార్యం.అదే విధంగా కరీంనగర్ లో గతంలో బీఆర్ఎస్ కోటగా ఉండేది. ప్రస్తుతం బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇక్కడ గెలిస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా మారుతుంది.అందుకే ఈ రెండు కార్పొరేషన్లలో పార్టీ అత్యంత ఫోకస్ పెట్టింది. ఇక నల్లగొండ, ఖమ్మం కాంగ్రెస్ వార్ వన్ సైడ్ గా భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ జిల్లాల నుంచే కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో సత్తా చాటాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. ఎప్పటికప్పుడు సర్వేలు చేపిస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేలా తగినంత ఏర్పాట్లు చేస్తున్నది.
ఫోల్ మేనేజ్ మెంట్ లో కొన్ని సమస్య లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. దీంతో ఈ టీమ్ లు ప్రత్యేకంగా పనిచేయనున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ పై ప్రభావం పడకుండా చూడటం,’ఆరు గ్యారంటీ’ల అమలు తీరును సమర్ధవంతంగా ప్రజలకు వివరిస్తూ పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడం వంటివి ఈ టీమ్స్ ముందున్న టాస్క్. మరోవైపు నిజామాబాద్లో అంతర్గత విబేధాలు, కరీంనగర్లో ప్రత్యర్థుల కేడర్ను ఎదుర్కోవడం వంటివి ఈ పోల్ మేనేజ్మెంట్లో కీలకం గా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టీమ్ లు ఏ స్థాయిలో పనిచేస్తాయనేది? ఫలితాల్లో తేలిపోనున్నది.