Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోవాల్సిన సమయంలో.. అకాల వర్షాలు ప్రజలను ఒక్కసారిగా పలకరించాయి. ఒకవైపు భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలకు ఎండల నుండి కొంత ఉపశమనం లభించినప్పటికీ.. రైతుల్లో మాత్రం ఆందోళన మొదలైంది.
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అయినవిల్లి.. మామిడికుదురు.. అమలాపురం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే ఉత్తరాంధ్రలోని విజయనగరం.. అనకాపల్లి.. పార్వతీపురం మన్యం జిల్లాల్లో వానల హోరు కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా అకాల వర్షం కురియడంతో జనజీవనం కొంత స్తంభించిపోయింది. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో కూడా అకాల వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్.. మంచిర్యాల.. వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే.. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గంగా పరివాహక ప్రాంతంలోని బెంగాల్.. ఛత్తీస్గఢ్.. ఒడిశా రాష్ట్రాల్లోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర.. కోస్తాంధ్ర.. రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి గాలులు వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆరబోసిన ధాన్యం తడవకుండా ఉండేలా రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.