బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికే అసెంబ్లీలో బడ్జెట్ కాపీలను చింపివేస్తూ ప్రతిపక్ష సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
2023 డిసెంబర్ నుండి 2026 వరకు గురుకులాల నిర్వహణపై పూర్తిస్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కూడా గురుకులాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, తెగల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే బడ్జెట్లో రూ. 19,721 కోట్లు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
విద్యార్థుల కోసం పకడ్బందీ చర్యలు
గురుకులాల్లో చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఎలాంటి కాస్మొటిక్ చార్జీలు పెండింగ్లో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యవేక్షణ కోసం ప్రతిరోజూ ఒక అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
కొత్త భవనాలు.. శిక్షణ కేంద్రాలు
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం కేవలం ఫౌండేషన్ వేసి వదిలేసిందని విమర్శించిన మంత్రి.. ఈ నాలెడ్జ్ టవర్లో పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే కాచిగూడ, నింబోలి అడ్డ ప్రాంతాల్లో కొత్తగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను నిర్మిస్తామని వెల్లడించారు. బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.