YS Vijayamma Letter: వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదంపై ఆయన భార్య వైఎస్ విజయమ్మ సంచలన లేఖ విడుదల చేశారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల యుద్ధంపై ఆమె స్పందిస్తూ.. అనేక కీలక వాస్తవాలను వెల్లడించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులేనని, ఇప్పటివరకు ఆస్తుల పంపకం అధికారికంగా జరగలేదని ఆమె స్పష్టం చేశారు. తన నలుగురు మనవలు, మనవరాళ్లకు ఆస్తులన్నీ సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయం, ఆదేశమని ఆమె గుర్తు చేశారు.
షర్మిలకు న్యాయంగా దక్కాల్సిన వాటా గురించే ఎంఓయూ (MOU) రాశారని విజయమ్మ పేర్కొన్నారు. నిజానికి ఎంఓయూలో రాసిన దానికంటే షర్మిలకు ఎక్కువ ఆస్తి దక్కాల్సి ఉందని, సరస్వతి సిమెంట్స్తో పాటు ఎంఓయూలో లేని యెలహంక భూమి కూడా షర్మిలదేనని ఆమె వివరించారు. జగన్ తన సోదరికి ఇచ్చానని చెబుతున్న డబ్బు ఆస్తి పంపకం కాదని, అది కేవలం ఆమె వాటాకు రావాల్సిన డివిడెండ్ మాత్రమేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని ఒక తల్లిగా ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆస్తుల పంపకం విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. గతంలో వైఎస్సార్ జగన్కు కొన్ని ఆస్తులు ఇచ్చినట్లే షర్మిలకు కూడా ఇచ్చారని, దానిని పూర్తిస్థాయి ఆస్తి పంపకంగా పరిగణించలేమని ఆమె వివరించారు. “నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు” అని పేర్కొంటూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని, రాజకీయ లబ్ధి కోసం ఈ కుటుంబ వ్యవహారాన్ని మీడియాలో పదేపదే ప్రస్తావించవద్దని ఆమె వేడుకున్నారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ అక్షర సత్యాలని ఆమె తన లేఖలో ఉద్ఘాటించారు.
Read Also: Roja Selvamani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు