Black Magic: టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. ఇప్పటికీ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కొంత మంది ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. ఆ ఊరి మాజీ సర్పంచ్ అభ్యర్థి క్షుద్రపూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంలో పగలంతా రాజకీయ నాయకుడిగా తిరుగుతున్న మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు, రాత్రివేళ వచ్చిన తరువాత మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక విద్యల పేరుతో గిరిజనులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తాంత్రిక పూజల పేరుతో ప్రజలను బెదిరించి, వారి అమాయకత్వాన్ని ఉపయోగించుకుని డబ్బులు గుంజుతున్నాడని గ్రామ పెద్దలు చెబుతున్నారు.
తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ.. అమాయక గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా.. ఓ క్షుద్ర మంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్నం రాసులపై మాంసం, రక్త తర్పణాలు చేస్తూ గాల్లోకి నిమ్మకాయను లేపిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
నాగరాజు గతంలో కూడా నేర కేసుల్లో చిక్కుకుని, జైలు శిక్ష అనుభవించి వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఫేక్ బ్యాంకు పాస్ పుస్తకాలు తయారుచేసి ప్రజలను మోసగించిన కేసులో అతను తప్పించుకోలేదని గ్రామ పెద్దలు గుర్తు చేశారు.
క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఈ నాగరాజు డబ్బే ప్రధాన ధ్యేయంగా క్షుద్ర పూజలు మాయమంత్రాలు, మాంత్రిక విద్యలు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు చెపుతున్నారు. ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టడం, ప్రజల్లో చైతన్యం నింపాల్సిన వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేయటంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. నాగార్జున కీలక వ్యాఖ్యలు
ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై.. తక్షణమే చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మూఢనమ్మకాల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక యువత కోరుకుంటున్నారు.