IAS Amrapali: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణ కేడర్కు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఈ పరిణామం వెనుక గతంలో జరిగిన సుదీర్ఘ న్యాయపోరాటం చరిత్ర ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఐఏఎస్ అధికారుల కేడర్ కేటాయింపులపై జరిగిన వివాదంలో ఆమ్రపాలి పాలుపంచుకున్నారు.
గత సంవత్సరం, డీవోపీటీ (Department of Personnel and Training) ఆదేశాల మేరకు తమను ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారులు అలాగే డీవోపీటీ తరపు వాదనలు విన్న హైకోర్టు ఈ అధికారుల పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కేడర్కు కేటాయించిన అధికారులు వెంటనే ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.
అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలు సమస్యలు ఏవైనా ఉంటే తర్వాత వింటామని హైకోర్టు ఆ సందర్భంగా స్పష్టం చేసింది. అధికారులు ముందుగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేపడతామని తెలిపింది. రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేమని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా సేవ కోసం పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారులు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే మళ్లీ కోర్టులకు రావడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ తీర్పు కారణంగా ఆమ్రపాలి సహా మిగిలిన అధికారులంతా ఏపీ కేడర్కు వెళ్లాల్సి వచ్చింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆమ్రపాలి నియమితులయ్యారు. అయితే, ఆ తర్వాత ఆమ్రపాలి తెలంగాణకు తిరిగి రావాలని కోరుతూ క్యాట్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్యాట్ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టు తాజాగా క్యాట్ తీర్పుపై స్టే విధించింది. దీనితో ఆమె తెలంగాణ కేడర్ కు మారే విషయంలో తాత్కాలికంగా ప్రతిష్టంభన ఏర్పడింది.