IndiGo Crisis Reason: ఇండిగో విమానాల రద్దుపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని ఆయన చెప్పారు. నవంబర్ 1 నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి తెచ్చామని, ఎఫ్టీటీఎల్ అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయన్నారు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైందన్నారు. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు.
పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే ఇండిగో విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నానన్నారు. 5,86,700 విమాన టికెట్ రద్దు అయ్యాయని తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా కేంద్రం పరిమితులు విధించిందన్నారు. టికెట్టు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘విమానాల ఆలస్యం, రద్దుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పౌర విమానయాన శాఖ నిబంధనలు విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇండిగో చెబుతున్న కారణాలపై విచారణ ప్రారంభించాం. నిరంతర సాంకేతిక పరిజ్ఞానం అప్గ్రేడేషన్ ఈ రంగంలో భాగం, భారతదేశ విమానయాన రంగానికి అత్యున్నత ప్రపంచ ప్రమాణాలను నిర్ధారించడమే మా లక్ష్యం’ అన్నారు.
“ప్రయాణికుల విషయానికొస్తే, మొత్తం 5,86,705 టికెట్లు రద్దు అయ్యాయి. దీనికి రూ. 569 కోట్లు రీఫండ్ చెల్లించారు. దీనితో పాటు సంస్థ పనితీరుపై మరిన్ని విషయాలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి” అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు స్పందిస్తూ.. తాము గతంలో కూడా అనేక చర్యలు తీసుకున్నామని, నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. ఈ మార్గదర్శకాలు, నిబంధనలు పాటించేలా చేయడమే నియంత్రణ సంస్థగా తమ విధిగా తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడల్లా కేంద్రం చర్య తీసుకోవడానికి వెనుకాడలేదని చెప్పారు.