Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం.. ప్రస్తుతం భక్తులకు ఇబ్బందులుగా మారింది. దక్షిణ కాశీగా పేరొందిన ఈ దేవాలయంలో అభివృద్ధి పనుల పేరుతో.. అధికారులు తీసుకున్న తాజా నిర్ణయాలు భక్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం ఇప్పటికే ప్రధాన గర్భగుడిలో దర్శనాలను నిలిపివేసిన అధికారులు, తాజాగా ఆలయ ప్రధాన ద్వారాన్నే మూసివేశారు. ఈ చర్యతో భక్తులు ఆలయంలోకి ప్రవేశించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం స్వామి వారి చతుష్కాల పూజలు కేవలం అర్చకుల సమక్షంలోనే జరుగుతున్నాయి.
భక్తులకు తాత్కాలికంగా భీమేశ్వరాలయంలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నప్పటికీ, ప్రధాన ఆలయంలో దర్శనాలు లేకపోవడం వల్ల భక్తులు నిరాశ చెందుతున్నారు.
గత నెల రోజులుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, పడమర వైపు నైవేద్యశాల, ఈవో కార్యాలయం వంటి పురాతన నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది.
తాజాగా ప్రధాన ద్వారం వద్ద కూడా ఇనుప రేకులు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం, ఆలయానికి అంచున పలు ప్రాంతాల్లో అడ్డంకులు సృష్టించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.
ముందస్తు సమాచారం లేకుండా ఇలా ద్వారం మూసివేయడం ఏ విధమైన నిర్ణయం? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వేములవాడ పరిస్థితిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కార్తీక మాసం కావడంతో రోజూ వేలాదిమంది రాజన్న దర్శనానికి వేములవాడకు తరలివస్తున్నా, ఆలయ ద్వారం మూసివేతతో చాలామంది నిరాశతో తిరుగు ప్రయాణం అవుతున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
పూర్వం కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం ఇప్పుడు వెలవెలబోతూ ఖాళీగా కనిపిస్తోంది. బయట ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ముందు భక్తులు మొక్కులు తీర్చుకుని వెళ్ళిపోతున్నారు. స్థానిక వ్యాపారులు కూడా ఈ పరిస్థితితో తీవ్రంగా నష్టపోతున్నారు.