Preethi: పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యా యత్నం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసిందామె. డోస్ ఎక్కువ ఉండటంతో.. కోమాలోకి వెళ్లింది. ఇదంతా వరంగల్లో జరిగింది. ప్రీతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ తరలించారు. ఇప్పటికీ ఆమె కండిషన్ సీరియసే అంటున్నారు వైద్యులు.
వరంగల్, కాకతీయ మెడికల్ కాలేజీ-KMCలో అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది ప్రీతి. ఆమెను సీనియర్ విద్యార్థి సైఫ్ కొంతకాలంగా ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నాడు. మూడు నెలలుగా అతడి టార్చర్ ఎక్కువైంది. మరీ ఓవర్ చేస్తుండటంతో ప్రిన్సిపల్కు కూడా కంప్లైంట్ చేసింది.
తనకు మద్దతు పలకాలని తోటి విద్యార్థులను కూడా కోరింది. రెండేళ్లు ఇక్కడే పనిచేయాలి కాబట్టి తమను కూడా వేధిస్తారని.. సీనియర్లతో మనకెందుకు గొడవని.. క్లాస్మేట్స్ ప్రీతి విషయంలో మౌనంగా ఉండిపోయారని ఆమె తండ్రి నరేంద్ర చెబుతున్నారు. ర్యాగింగ్పై కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. అయితే, ప్రిన్సిపల్ మాట మరోలా ఉంది. ర్యాగింగ్ విషయం తన దృష్టికి వచ్చిందని.. వారిద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చానని చెప్పారు కేఎమ్సీ ప్రిన్సిపల్.
ప్రీతి తండ్రి నరేంద్ర ఆర్పీఎఫ్ వరంగల్లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం హైదరాబాద్లో ఉంటోంది. మంగళవారం రాత్రి చివరి సారిగా ఆమె తన సోదరుడితో మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రీతిపై ర్యాంగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థిపై, కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు.