కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ నిన్న నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కాంగ్రెస్ హయాంలో వైట్ ఎలిఫెంట్లా మారిందని బీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో లక్ష ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించామని, అందుకే రాష్ట్రంలో పంటల దిగుబడి భారీగా పెరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు పలుమార్లు గుర్తుచేశారు.
మేడిగడ్డ బ్యారేజీకి త్వరగా మరమ్మతులు నిర్వహించి ప్రాజెక్టును వాడుకలోకి తీసుకురావాలని హరీశ్తో పాటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సర్కారును పలుమార్లు డిమాండ్ చేశారు. అయితే,కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, కాంట్రాక్టర్లకు విచ్చల విడిగా బిల్లులు చెల్లింపులు చేశారు గానీ, నాణ్యతా ప్రమాణాల గురించి పట్టించుకోకపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయని అధికార పార్టీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని సైతం భారీగా పెంచారని తీవ్ర విమర్శలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీవీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. సుమారు ఏడాది పాటు విచారణ అనంతరం ఆ ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ సీఎం కేసీఆర్దే కీలక పాత్ర అని ఘోష్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఇరిగేషన్ అధికారులు, మాజీ మంత్రి విచారణ అనంతరం వారి స్టేట్మెంట్స్ ఆధారంగానే కమిషన్ ఈ మేరకు నివేదికను ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీనిని కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఈనెల 22న తుది తీర్పు వెల్లడించనుంది.
హైకోర్టు తీర్పు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి గల బాధ్యులపై సర్కారు చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది. కాగా, ఈలోపు కాళేశ్వరం ప్రాజెక్టును నిరూపయోగంగా వదిలేయకూడదని సీఎం రేవంత్ నిర్ణయానికి వచ్చారు. వీలైనంత త్వరగా మూడు బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా చూస్తానని అధికారులకు చెప్పారు. అయితే, ఇంత కాలం ప్రాజెక్టును రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని విమర్శలు చేసిన హరీశ్ రావు.. ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తారు? ఆయన వెర్షన్ ఏంటి? రేవంత్ ముందు చూపును మెచ్చుకుంటారా? లేదా మరల విమర్శిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.