రాష్ట్రం, కేంద్రంలో రాజ్యసభ ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఈనెల 16న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెలలో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతుండగా.. వాటి కోసం ఈనెల ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఏఐసీసీ నేత అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రెన్యూవల్ లభించగా, ప్రభుత్వ మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026లో మొత్తంగా 72 నుంచి 76 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. తేదీ ప్రకారం వచ్చేనెల పదవీ కాలం (ఆరేండ్లు) పూర్తయ్యే స్థానాలు మొత్తం 37 ఉన్నాయి. తొలిదశలో వీటికి ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ఇవాళ ఉదయం సదరు అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేశారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థుల ఎవరూ ఖరారు కాలేదు. అసలు బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపుతుందా? లేదా అనేది కూడా అనుమానంగా ఉన్నది. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతుండగా వాటిలో కనీసం ఒక్కటి కూడా దక్కించుకున సంఖ్యా బలం గులాబీ పార్టీకి లేదని తెలుస్తున్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 38 స్థానాల్లో గెలుపొందింది. అందులో పది మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.వారిపై ఫిరాయింపుల చట్టం కింద విచారణ జరుగుతోంది. 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంగీకరించారు. మిగతా ఇద్దరిపై ఇంకా విచారణ జరుగుతోంది.
ఒకవేళ రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరైనా అభ్యర్థిని బరిలో దింపితే అధిష్టానం జారీ చేసే విప్ను ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాటిస్తారా? అనే సందేహం నెలకొన్నది. రెండు రాజ్యసభ స్థానాల్లో కనీసం ఒక్కటి గెలుచుకోవాలన్నా 40 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. బీఆర్ఎస్ వద్ద కేవలం 38 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అందులో సుమారు 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విప్కు కట్టుబడి ఉంటారా? అన్నది అనుమానమే. ఒకవేళ పాటించినా 2 ఓట్లు తక్కువ అవుతాయి. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సాయం తీసుకుంటే ఆ పార్టీల మధ్య బంధం మరోసారి బయటపడుతుంది. ఒకవేళ బీజేపీ మద్దతు అవసరం లేదనుకుంటే.. అభ్యర్థులను బరిలో దింపడం కూడా వృథానే. ఇదే విషయంపై గులాబీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీకి 38 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. బీజేపీకి 6 సీట్లు ఉన్నాయి. బీజేపీ మద్దతిస్తే ఒక రాజ్యసభ బీఆర్ఎస్ వశం అవుతుంది. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో అసలు సమస్య నెలకొన్నది. చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే ఎలా అని బీఆర్ఎస్ ఆలోచిస్తుండగా.. ఇటువంటి సమయంలో బీఆర్ఎస్.. బీజేపీకి మద్దతు ఇస్తుందా? అని కూడా చర్చ జరుగుతున్నది. బీజేపీకి ఇక్కడ సంఖ్యాబలం లేదు. ఎటుచూసినా రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే మరో 7 మంది.. మొత్తంగా 71 స్థానాలు కాగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు 9 మంది మద్దతిస్తే కాంగ్రెస్కు రెండు రాజ్యసభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. కాగా, కాంగ్రెస్కు రెండు రాజ్యసభ స్థానాలు దక్కుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.