Indian Railways Speed Revolution: భారతీయ రైల్వే వేగాన్ని పెంచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. గ్రాండ్ కార్డ్ సెక్షన్లో నిర్వహించిన ట్రయల్ రన్ లో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. భారతీయ రైల్వేలో ఇదో మైలురాయిగా రైల్వే అధికారులు అభివర్ణించారు. ఇది కేవలం ఓ టెస్ట్ రన్ అయినప్పటికీ, భవిష్యత్తులో భారత రైల్వే ప్రయాణ వేగాన్ని కళ్లకు కట్టిందన్నారు.
ఈ టెస్ట్ రన్ తూర్పు మధ్య రైల్వే పరిధిలోని గ్రాండ్ కార్డ్ లైన్ లో జరిగింది. ఈ మార్గం గయా, కోడెర్మా, గోమో, సోనగర్ లాంటి ముఖ్య ప్రాంతాల గుండా వెళ్లి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ ను ధన్ బాద్ తో కలుపుతుంది. ఇది తూర్పు భారతంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి. ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు కూడా ఈ లైన్ చాలా కీలకం. తాజాగా ఈ మార్గంలో రైలు 180 కి.మీ వేగంతో ప్రయాణించడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, రైలు ఈ వేగం అందుకోవడం వెనుక, గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే ట్రాక్ల నాణ్యతను మెరుగుపరచడం, సిగ్నలింగ్ వ్యవస్థలను ఆధునీకరించడం, భద్రతా ప్రమాణాలను పెంచడం లాంటి కీలక నిర్ణయాలు ఉన్నయన్నారు. ఈ మార్పుల కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో స్పీడ్ టెస్టులు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సాధారణ రైళ్లు ఈ సెక్షన్లో ఇంత వేగంతో నడవవు. కానీ, ఈ ట్రయల్స్ ద్వారా ట్రాక్ బలం, భద్రతా వ్యవస్థలు, రైళ్ల పనితీరును పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో ప్రయాణికులకు వేగవంతమైన సర్వీసులు అందించాలంటే ఈ పరీక్షలు చాలా అవసరం. ఈ మార్గంలో భద్రతపై కూడాఅధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రాక్ ల వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ట్రాక్ మీదికి పశువులు రాకుండా చేస్తున్నారు. అలాగే కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఇన్ స్టాల్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also: రైల్లోనే రెస్టారెంట్, స్పా, బార్.. జస్ట్ రూ.500కే!
ఇక ఈ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో,రానున్న రోజుల్లో ముఖ్యంగా మెట్రో నగరాలు, ప్రధాన నగరాల మధ్య ప్రయాణం వేగంగా మారుతుంది. సురక్షితంగా ప్రయాణించే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ రైళ్లు దేశంలో నడుస్తున్నాయి. ఇలాంటి ట్రయల్స్ వల్ల భవిష్యత్తులో మరిన్ని వేగవంతమైన రైళ్లు ప్రవేశించే అవకాశం ఉంది. దీని ద్వారా భారత రైల్వే వ్యవస్థ మరింత ఆధునికంగా మారుతుంది.
Read Also: విమానాల్లో చేస్తున్నట్లే.. ఆ రైళ్లలో కూడా అది తప్పనిసరి చేయండి.. కోర్టు కీలక వ్యాఖ్యలు!