Flight Cuts: విమాన ప్రయాణికులకు గట్టి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. దేశీయ విమానయాన రంగంలో దాదాపు 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న ఎయిర్ ఇండియా, ఇండిగోలు సంస్థలు.. తమ సర్వీసులను తాత్కాలికంగా తగ్గించుకోవాలని నిర్ణయించాయి. జూన్ 1 నుంచి రాబోయే మూడు నెలల పాటు (ఆగస్టు 31 వరకు) ఈ విమాన సేవల కోత అమలులో ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన (ATF) ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు వేసవి సెలవలు ముగియనుండటంతో ప్రయాణికులు గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తమ సర్వీసులను తగ్గించుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు నిర్ణయించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ 3 నెలల కాలంలో రెండు విమానయాన సంస్థలు పెద్ద మెుత్తంలో సర్వీసుల్లో కోత విధింతబోతున్నాయి. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 15 శాతం వరకు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండిగో తన మొత్తం సర్వీసులలో 5 నుండి 7 శాతం వరకు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రద్దు చేయాలని భావిస్తున్న విమాన సర్వీసులను ఇప్పటికే బుకింగ్ వెబ్సైట్ల నుండి తొలగించినట్లు సమాచారం.
గతంలో కిలో లీటర్ విమాన ఇంధనం (ATF) ధర రూ. 80,000 ఉండగా.. ప్రస్తుతం అది రూ. 1 లక్ష దాటిపోయింది. వివిధ రాష్ట్రాల్లో విధించే వ్యాట్ కారణంగా ఈ ధరలు మరింత పెరిగిపోయాయి. ఇంత భారీ వ్యయంతో విమానాలను నడపడం ఆర్థికంగా నష్టదాయకంగా మారిందని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
సాధారణంగా విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధనానికే దాదాపు 40 శాతం ఖర్చవుతుంది. ఇరాన్ – అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా వీటి ధరలు మరింత పెరిగి.. నిర్వహణ ఖర్చులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆ భారం భరించలేక ఇప్పటికే పలు విమానయాన సంస్థలు.. టికెట్ల ధరలను భారీగా పెంచాయి. అయితే స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానుండటంతో జూన్ నుంచి ప్రయాణాల రద్దీ సహజంగానే తగ్గనున్న నేపథ్యంలో సర్వీసులను తగ్గించుకోవాలని విమానయాన సంస్థలు నిర్ణయించాయి.
కదిలే ‘వాషింగ్ మిషన్’.. చేత్తో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. 7 నిమిషాల్లో బట్టలు వాష్!
దేశీయ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేయకపోయినప్పటికీ కొన్ని ప్రధాన నగరాల మధ్య నడిచే విమానాల సంఖ్య మాత్రం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి మెట్రో నగరాల మధ్య నడిచే సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశముందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంబయి – అహ్మదాబాద్, దిల్లీ – హైదరాబాద్, దిల్లీ – బెంగళూరు, దిల్లీ – కోల్ కత్తా రూట్లలో ఎయిర్ ఇండియా, ఇండిగో సేవలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: జియో సరికొత్త ప్లాన్.. రూ.200కే 15 ఓటీటీలు.. 1000 టీవీ ఛానెల్స్ ఫ్రీ!