Air India Charge Hike: అమెరికా-ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ , ఇంటర్నేషనల్ మార్గాల్లో ఇంధన సర్ఛార్జీలను పెంచింది. దీంతో విమాన ప్రయాణికులపై మరింత భారం పడనుంది. కొత్త సర్ఛార్జ్ విధానం దేశంలో ఏప్రిల్ 8 నుంచి, అంతర్జాతీయ మార్గాలకు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతో.. చమురు నౌకలు నిలిచిపోయాయి. దీంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సర్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని టాటా గ్రూప్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఏవియేషన్ ఫ్యూయల్ ఛార్జీలు పెరగడంతో నిర్వహణ ఖర్చులు పెరిగాయని విమానయాన సంస్థలు అంటున్నాయి.
దేశీయ ప్రయాణాల కోసం సర్ ఛార్జీలను ఎయిర్ ఇండియా సవరించింది. తక్కువ దూర మార్గాల్లో (0–500 కి.మీ) ప్రతి సెక్టార్కు అదనంగా రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2,000 కి.మీ.లకు మించిన ప్రయాణాలకు రూ.899 వరకు సర్ ఛార్జీ విధించింది. దేశీయ మార్గాల్లో ఏటీఎఫ్ ఛార్జీల పెంపును 25 శాతానికి పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ సవరణ ఉందని ఎయిర్ ఇండియా పేర్కొంది. సర్ ఛార్జీల సవరణతో టికెట్ల ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
0–500 కి.మీ – రూ. 299
501–1000 కి.మీ – రూ. 399
1001–1500 కి.మీ – రూ.549
1501–2000 కి.మీ – రూ.749
2000 కి.మీపైగా – రూ.899
దేశీయ మార్గాల్లో ఏప్రిల్ 08, 2026 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
ఇంటర్నేషనల్ రూట్లలో ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణుల అంచనా. అంతర్జాతీయ ధరలపై ఎలాంటి ధరల నియంత్రణ ఏదీ లేదు. ఎయిర్ ఇండియా ప్రాంతాన్ని బట్టి సర్ ఛార్జీలను భారీగా పెంచింది. భారత్ కు దగ్గర్లోని సార్క్ దేశాలకు 24 డాలర్లు, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు 280 డాలర్ల వరకు ఛార్జీ చేయనుంది.
పెరిగిన ఇంధన ఖర్చులలో కొంత భాగాన్ని తామే భరిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. అదనపు భారం లేకపోతే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని విమానయాన సంస్థ చెప్పింది.
అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు మార్చి నెలాఖరు నాటికి బ్యారెల్కు 195.19 డాలర్లు పెరిగాయి. కేవలం కొన్ని వారాల క్రితం ఇంధన ధరలు సుమారు 99 డాలర్లుగా ఉండేవి. రిఫైనింగ్ మార్జిన్లు, క్రాక్ స్ప్రెడ్లు కూడా తక్కువ టైమ్ లోనే మూడు రెట్లు పెరిగాయి. దీంతో విమానయాన సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరిగింది.
ఇండిగో తమ ఇంధన సర్ఛార్జ్ విధానాన్ని సవరించిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. నిర్వహణ ఖర్చులలో ఫ్యూయల్ సాధారణంగా సుమారు 40% ఉంటుంది.