Bengaluru–Vijayawada Economic Corridor: బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లను కలిపే బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ 343 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల రహదారి పూర్తయితే, బెంగళూరు–విజయవాడ మధ్య దూరం సుమారు 110 కిలోమీటర్లు తగ్గనుంది. దీంతో ప్రయాణంలో 3 నుంచి 4 గంటల వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఈ కారిడార్ను ఆధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇది యాక్సెస్ కంట్రోల్ ఆరు లేన్ల రహదారిగా ఉండనుంది. ప్రయాణం వేగంగా సాగడంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. కారిడార్లో మొత్తం 17 ఇంటర్ ఛేంజ్ లు, 10 వే సైడ్ కన్వీనియెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 5.3 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు కూడా ఇందులో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రహదారి అటవీ ప్రాంతాల గుండా సాగనుంది.
ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సీతారామపురం మధ్య 3.68 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ను నిర్మిస్తున్నారు. దీని కారణంగా ఏకంగా 17 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. ఈ ప్యాకేజీ నిర్మాణ అంచనా వ్యయం రూ.1,092.18 కోట్లు. పనులు 2027 మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కారిడార్ పూర్తయిన తర్వాత బెంగళూరు–విజయవాడ మధ్య రాకపోకలు మాత్రమే కాదు, రాయలసీమ ప్రాంతానికి కూడా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, ఉత్తర ప్రాంతాలతో అనుసంధానం మరింత బలపడుతుంది. అలాగే NH-44, NH-16 వంటి ప్రధాన జాతీయ రహదారులతో కనెక్టివిటీ పెరగనుంది. హిందూపురం, కొప్పర్తి లాంటి పారిశ్రామిక కేంద్రాలకు నేరుగా చేరుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. దీంతో పరిశ్రమలు, సరకు రవాణా, వ్యాపార కార్యకలాపాలకు ఈ మార్గం ఉపయోగపడనుంది.
ఈ కారిడార్ మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకుంది. నిర్మాణ పనుల సమయంలోనే భారీ స్థాయిలో రహదారి నిర్మాణం చేపట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. జనవరి 6న 24 గంటల్లో 28.89 లేన్ కిలోమీటర్ల బిటుమినస్ కాంక్రీట్ వేయడంతో పాటు 10,655 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. అదే నెల 11న మరో రెండు రికార్డులు నమోదయ్యాయి. నిరంతరాయంగా 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్, 156 లేన్ కిలోమీటర్ల మేర రహదారి పనులు చేపట్టారు. 2027 నాటికి కీలక పనులు పూర్తయితే, రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణాలో ఈ మార్గం పెద్ద మార్పు తీసుకురానుంది.
Read Also: ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..