Amaravati Giant Observation Wheel: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన లండన్ ఐ తరహాలో అమరావతి ఐ పేరుతో భారీ అబ్జర్వేషన్ వీల్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.
లండన్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన లండన్ ఐ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే తరహా డిజైన్ తో అమరావతిలో కూడా భారీ వీల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి కొత్త ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
అమరావతి ఐను కృష్ణా నది తీరంలో నిర్మించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని సుమారు ఆరు ఎకరాల భూమిని కేటాయించనున్నారు. నది ఒడ్డున ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వల్ల సందర్శకులకు అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఈ భారీ అబ్జర్వేషన్ వీల్ లో ప్రత్యేక క్యాప్సూల్స్ ఏర్పాటు చేస్తారు. వీటిలో కూర్చొని సందర్శకులు ఎత్తుకు వెళ్లి అమరావతి నగర అందాలు, కృష్ణా నది ప్రవాహం, పరిసర ప్రాంతాల సహజ సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నగర లైటింగ్ మధ్య ఈ ఎక్స్ పీరియెన్స్ మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశముంది.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును డీబీఎఫ్వోటీ (Design, Build, Finance, Operate and Transfer) విధానంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంలో ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టును రూపొందించి, నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చి, నిర్ణీత కాలం పాటు మెయింటెనెన్స్ చేస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాయి. అమరావతి ఐ ప్రాజెక్టును 30 ఏళ్ల కాలపరిమితితో అమలు చేసేలా టెండర్లు పిలవనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ, విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడం, పర్యాటక ఆదాయాన్ని పెంపొందించడం వంటి ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టులు నగర అభివృద్ధికి తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. లండన్ ఐ తరహాలో రూపొందనున్న అమరావతి ఐ పూర్తయితే, కేవలం వినోద కేంద్రంగా మాత్రమే కాకుండా అమరావతి నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Read Also: 443 అడుగుల ఎత్తులో లండన్ అందాలు.. యూకే వెళ్లే వాళ్లు అస్సలు మిస్సవ్వొద్దు!