Amaravati and Future City: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు భారీ నగరాల నిర్మాణంపై దృష్టి పెట్టాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుండగా.. మరోవైపు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలోని సాంకేతిక, ఆర్థిక రంగాల్లో కూడా పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి.
ఏపీలో కృష్ణా నది ఒడ్డున అమరావతిని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 53,000 ఎకరాల విస్తీర్ణంలో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించే ప్రణాళికలు శరవేగంగా ముందుకుసాగుతున్నాయి. స్మార్ట్ పరిపాలనా వ్యవస్థతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అమరావతిని కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నగరంగా కాకుండా.. టెక్నాలజీకి కేంద్రంగా మార్చే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ టెక్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అమరావతి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.66,000 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ నగరం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే సుమారు 20 లక్షల మంది నివసించే అవకాశం ఉండగా.. దాదాపు 15 లక్షల ఉద్యోగాలకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. రోడ్లు, రవాణా, ప్రభుత్వ భవనాలు, నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలను కలిపి నగరాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కు సమీపంలో 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నగరాన్ని సాధారణ నివాస ప్రాంతంగా కాకుండా.. భవిష్యత్ టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, నెట్ జీరో పరిశ్రమలకు ఫ్యూచర్ సిటీని గ్లోబల్ హబ్ గా మార్చాలని భావిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్లు, టెక్నాలజీ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో భాగంగా AWS డేటా సెంటర్ కోసం సుమారు రూ.58,000 కోట్ల పెట్టుబడి లాంటి భారీ ప్రైవేట్ పెట్టుబడులు కూడా ప్రస్తావనలోకి వచ్చాయి. ఈ పెట్టుబడులు కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది.
ఈ రెండు మెగా నగరాల అభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలకంగా మారనుంది. రీజినల్ రింగ్ రోడ్లు, మెట్రో నెట్ వర్క్ లు, హైస్పీడ్ రైలు లాంటి ఆధునిక రవాణా సౌకర్యాలను అనుసంధానించేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే భారీ ప్రాజెక్టులకు సవాళ్లు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి సరిపడ నిధులు అందుబాటులో ఉండాలి. మరోవైపు ఫ్యూచర్ సిటీకి అవసరమైన భూమిని సమీకరించడం పెద్ద ప్రక్రియగా మారనుంది.
అమరావతి పరిపాలన, టెక్నాలజీ కేంద్రంగా ఎదగాలని చూస్తుండగా.. ఫ్యూచర్ సిటీ టెక్నాలజీ, పరిశ్రమలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు ప్రాజెక్టులు అనుకున్న విధంగా పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశ అభివృద్ధికి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది. అయితే, ప్రణాళికలను వాస్తవ రూపంలోకి తీసుకురావడమే ఇప్పుడు ముందున్న అసలు సవాల్.
Read Also: శతాబ్దానికి పైగా చరిత్ర.. ఇప్పటికీ వన్నె తగ్గని నిజామీ వైభవం.. కాచిగూడ రైల్వే స్టేషన్ గొప్పదనం ఇదే!