దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా దేశ రవాణా రంగంలో చారిత్రాత్మక మార్పుకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. సహకార స్ఫూర్తితో రూపొందించిన ‘భారత్ టాక్సీ’ యాప్ ద్వారా డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్ ప్రాంతాలకు చెందిన క్యాబ్, ఆటో డ్రైవర్లతో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 5న ప్రారంభమైన ఈ యాప్ వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలైన ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్లకు ధీటుగా భారత్ టాక్సీ యాప్ పనిచేస్తుందని వెల్లడించారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైవేటు సంస్థలు డ్రైవర్ల కష్టార్జితంలో 30 శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. ఈ విధానం వల్ల కేవలం యాప్ కంపెనీలు మాత్రమే ఆర్థికంగా బలపడుతున్నాయని డ్రైవర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమం కోసం భారత్ టాక్సీని ప్రవేశపెట్టింది. ఇందులో ఎలాంటి కమీషన్ ఉండదని జీరో కమీషన్ విధానంతో డ్రైవర్లకు పూర్తి ఆదాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్లో సభ్యత్వం కోసం కేవలం రూ.500 చెల్లిస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు.
భారత్ టాక్సీ పనితీరును అముల్, ఇఫ్కో, నాబార్డు వంటి విజయవంతమైన సహకార సంస్థలతో అమిత్ షా పోల్చి వివరించారు. అముల్ సంస్థలో లక్షలాది మంది మహిళల భాగస్వామ్యం ఎలాగైతే విజయం సాధించిందో భారత్ టాక్సీ కూడా డ్రైవర్ల యాజమాన్యంలోనే నడుస్తుందని వివరించారు. ఈ సంస్థ ఆర్జించే లాభాల్లో 80 శాతం మొత్తాన్ని డ్రైవర్లు నడిపిన కిలోమీటర్ల ప్రాతిపదికన వారి ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 20 శాతం నిధులను సంస్థ మూలధనంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఎగ్జాంపుల్.. రాబోయే మూడేళ్లలో రూ.25 కోట్ల ఆదాయం వస్తే అందులో రూ.20 కోట్లు నేరుగా డ్రైవర్లకే అందుతాయని ఆయన లెక్కలతో వివరించారు.
రానున్న రెండేళ్లలో దాదాపు 15 కోట్ల మంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్పైకి తీసుకురావడమే లక్ష్యమని అమిత్ షా తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న అన్ని నగరాల్లో మూడు ఏళ్లలోపు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వ్యవస్థ పూర్తిగా పటిష్టం కావడానికి కొంత సమయం పడుతుందని అప్పటి వరకు డ్రైవర్లు సహనం పాటించాలని కోరారు. డ్రైవర్ల ప్రతినిధులు కూడా ఈ సహకార సంస్థ బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని డ్రైవర్లకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వారు అడ్డుకుంటారని హామీ ఇచ్చారు.
ప్రైవేటు కంపెనీల మాదిరిగా ఆదాయం గడించడం తమ లక్ష్యం కాదని డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రభుత్వ బాధ్యతని అమిత్ షా స్పష్టం చేశారు. అందుభాటు ధరలో ఛార్జీలు, డ్రైవర్ల లాభాలను దృష్టిలో ఉంచుకోవడమే భారత్ టాక్సీ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఎనిమిది ప్రధాన సహకార సంస్థల సహకారంతో నడుస్తున్న ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, రాజ్కోట్ లలో విజయవంతంగా సాగుతోందని త్వరలోనే దేశవ్యాప్త విప్లవంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: SBI Recruitment: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు