Helmet Safety: సికింద్రాబాద్ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సాధారణంగా హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ పోలీసులు మానవీయ కోణంలో అరైవ్ అలైవ్ (Arrive Alive) అనే కార్యక్రమంలో భాగంగా ‘హెల్మెట్ బ్యాంక్’ అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి నేతృత్వంలో సికింద్రాబాద్లోని కీలకమైన సంగీత్ కూడలి వద్ద ఈ హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్ల.. ముఖ్యంగా తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మరణాలను అరికట్టాలని.. వాహనదారుల్లో ట్రాఫిక్ నియమాల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులను పోలీసులు ఆపి.. వారికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం వివిధ కారణాల వల్ల హెల్మెట్ మర్చిపోయిన వారికి, లేని వారికి పోలీసులే స్వయంగా ఉచితంగా హెల్మెట్ అందజేస్తారు. ఆ హెల్మెట్ పొందిన వాహనదారుడు సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకున్నాక.. తిరిగి 24 గంటల్లోపు ఆ హెల్మెట్ను హెల్మెట్ బ్యాంకులో జమ చేయాలని తెలిపారు. ఇది కేవలం జరిమానా వేయడమే కాకుండా.. వారి ప్రాణ రక్షణ పట్ల బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం.
ప్రస్తుతం సంగీత్ కూడలిలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వాహనదారుల ప్రాణాలకు భద్రత కల్పించడమే తమ ప్రాధాన్యతని డీసీపీ రాహుల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. త్వరలోనే బేగంపేట వంటి ఇతర రద్దీ ప్రాంతాల్లో కూడా ఈ హెల్మెట్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!