Chennai Metro Train Stuck: నగర ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో మెట్రోకు మంచి ఆదరణ కొనసాగుతోంది. ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా నిత్యం లక్షలాది మంది సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తాజాగా చెన్నై మెట్రోలో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్లకు ఊహించని ఘటన ఎదురయ్యింది. ఉన్నట్టుండి ఆగిపోవడంతో షాకయ్యారు. చివరకు చేసేదేమీ లేక రైలు దిగి నడుచుకుంటూ దగ్గరల్లోని స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది.
ఇవాళ ఉదయం సెంట్రల్ మెట్రో పరిధిలోని సబ్ వేలో మెట్రో రైలు చిక్కుకుంది. విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడంతో రైలు ఆగిపోయినట్లు ప్రయాణీకులు వెల్లడించారు. మెట్రోలో విమ్కో నగర్ డిపో వైపు ప్రయాణించే ప్యాసింజర్స్ సబ్ వేలో చిక్కుకోవడంతో రైల్లో నుంచి దిగి ట్రాక్ మీద నడవాల్సి వచ్చింది. విమ్కో నగర్ డిపో, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య నడిచే చెన్నై మెట్రో రైలు బ్లూ లైన్ లో తెల్లవారుజామున సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దాదాపు పది నిమిషాల పాటు మెట్రోలోనే ప్రయాణికులు ఉండిపోయారు.
కాసేపటి తర్వాత రైల్లో సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిందని, అధికారులు ప్రకటించారు. దగ్గరలోని హైకోర్టు మెట్రో స్టేషన్ కు వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో రైల్లోని ప్యాసింజర్లు కిందికి దిగారు. టన్నెల్ లో నుంచి పట్టాల నడుచుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం టన్నెల్లో నడుస్తున్న ప్రయాణీకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు, గంటల తరబడి సర్వీసులు బంద్..
కొద్ది గంటల తర్వాత రైల్లోని సమస్యలను సరిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మెట్రో సేవలను యథావిధిగా నడిపించినట్లు వెల్లడించారు. ఈ మేరకు చెన్నై మెట్రో రైలు అధికారికంగా ప్రకటించింది. “బ్లూ లైన్ లోని విమానాశ్రయం- విమ్కో నగర్ డిపో మధ్య మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ మెట్రో నుంచి గ్రీన్ లైన్ లోని సెయింట్ థామస్ మౌంట్ వరకు కూడా సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి” అని వివరించింది. అటు రైలు ఆగిపోవడం వల్ల ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. “ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందికి మేం చింతిస్తున్నాం. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం” అని వెల్లడించారు. అటు మెట్రో రైలు ఆగిపోయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “పొద్దున్నే ప్రయాణీకులుకు చెన్నై మెట్రో వాకింగ్ చేయించింది” అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!