Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు వసతి గదుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై ముందుగా సీఆర్వో (కేంద్రీయ విచారణ కార్యాలయం)లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు, గదులు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎస్ఎంఎస్, డిస్ప్లే బోర్డుల ద్వారా సమాచారం అందించి, సంబంధిత ఉప విచారణ కార్యాలయాల్లో గదులు కేటాయిస్తారు.
మెుబైల్ నెంబర్తో ఫేస్ రికగ్నిషన్..
ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి సీఆర్వోలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. భక్తులు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్తో ఫేస్ రికగ్నిషన్ విధానంలో నమోదు చేసుకోవాలి. అనంతరం రూ.50, రూ.100 (A కేటగిరీ), రూ.1000 (B కేటగిరీ) గదుల్లో తమకు నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనంతరం అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అందజేస్తారు.
15 నిమిషాల్లో మెుబైల్కు గది వివరాలు..
గది సిద్ధమైన వెంటనే రిజిస్ట్రేషన్ సంఖ్య డిస్ప్లే బోర్డులో ప్రదర్శించడంతో పాటు, 15 నిమిషాల్లోపు మొబైల్కు ఎస్ఎంఎస్ ద్వారా గది వివరాలు పంపిస్తారు. ఎస్ఎంఎస్ అందకపోతే సీఆర్వోలోని కియోస్క్లో స్లిప్ స్కాన్ చేసి గది వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి ఫోన్పే, గూగుల్పే, యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లింపు చేసి గది తాళాలు తీసుకోవాలి.
ఈ వయస్సు వారికే గదులు కేటాయింపు..
టీటీడీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం 21 సంవత్సరాలు నిండినవారికే గదులు కేటాయిస్తారు. ఒకసారి గది పొందిన వ్యక్తికి 30 రోజుల వరకు మరో గది ఇవ్వరు. ఒక కుటుంబం నుంచి ఒక్కరే రిజిస్ట్రేషన్కు రావాలి. ఒంటరి వ్యక్తులు లేదా అవివాహితులకు గదులు కేటాయించబడవు.
గదులు 24 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. గడువు దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. నీరు, విద్యుత్ వృథా చేయకుండా, ప్లాస్టిక్ బాటిళ్లు వినియోగించకుండా, పరిశుభ్రత పాటిస్తూ టీటీడీ నిబంధనలను భక్తులు తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు కోరారు.
Also Read: చంద్రబాబు, జగన్లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం