Rainwater Harvesting: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గుట్టల బేగంపేటలోని బీవర్లీ హిల్స్ లోని బీవర్లీ స్ప్రింగ్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన మూడు ఇంకుడు గుంతలను, మరో ఇంకుడు గుంతను డ్రిల్లింగ్ చేసి ఇంజెక్షన్ బోర్గా మార్చిన రీచార్జ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు.
ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ..
ఇంకుడు గుంతను, పాడైపోయిన బోరుబావిని వినియోగించి ఏర్పాటు చేసిన రీఛార్జ్ పిట్(ఇంజక్షన్ బోర్ వెల్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను కేవలం భవన నిర్మాణ అనుమతులు లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందడం కోసమే నామమాత్రంగా ఏర్పాటు చేయవద్దని ఎండీ స్పష్టం చేశారు.
వర్షిపు నీటి సంరక్షణ మీ బాధ్యత..
ప్రతి భవనం పైకప్పుపై కురిసే వర్షపు నీటి ప్రతి చుక్కను అదే ప్రాంగణంలో భూమిలోకి ఇంకేలా శాస్త్రీయంగా రూఫ్టాప్ రేన్వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్లు నిర్మించాలని సూచించారు. ప్రతి ఇంటిని, కుటుంబాన్ని, అపార్ట్మెంట్ను నీటి కొరత నుంచి రక్షించుకోవాలంటే వర్షపు నీటి సంరక్షణను మీ బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రభుత్వం, జలమండలి చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే నగరానికి శాశ్వత నీటి భద్రత సాధ్యమవుతుందని ఎండీ పేర్కొన్నారు.
ట్యాంకర్ బుకింగ్లలో భారీ పెరుగుదల..
గత ఏడాది వేసవిలో సుమారు 4 వేల అపార్ట్మెంట్లు జలమండలి ట్యాంకర్ నీటిని వినియోగించగా, ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 12,500 అపార్ట్మెంట్లకు పెరిగిందని ఎండీ తెలిపారు. వర్షాలు కురుస్తున్న రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ట్యాంకర్ బుకింగ్లు నమోదవుతున్నాయని చెప్పారు. ట్యాంకర్ బుకింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి అపార్ట్మెంట్, భవనం, ప్రాంతానికి సంబంధించిన రోజువారీ నీటి అవసరాల డేటా జలమండలి వద్ద అందుబాటులో ఉందన్నారు. ఈ సమాచారాన్ని విశ్లేషించి, అత్యధికంగా ట్యాంకర్లు బుక్ చేస్తున్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు అవసరమైన ఫిల్లింగ్ స్టేషన్లు, ట్యాంకర్లు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.
Also Read: సామాన్యుడిలా బస్సులో మంత్రి.. బస్సు స్టాప్లో ఆపని డ్రైవర్, కండక్టర్ సస్పెండ్!
బోర్లు ఎండిపోవడానికి ప్రధాన కారణాలు
గతంలో అయ్యప్ప సొసైటీ, కూకట్పల్లి, ఎస్.ఆర్.నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉండేదని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ తగ్గినప్పటికీ, సాధారణంగా నీటి సమస్య తక్కువగా ఉండే ఉప్పల్, ఎల్బీనగర్, ఎన్టీఆర్నగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగిందన్నారు. వర్షాలు ఆలస్యంగా కురవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు.
మౌలిక వసతుల విస్తరణ..
గతంలో 300 గజాల స్థలంలో ఒక కుటుంబం నివసించగా, ప్రస్తుతం అదే విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అనేక కుటుంబాలు నివసిస్తున్నాయని ఎండీ పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి అవసరం అనేక రెట్లు పెరుగుతోందన్నారు. ఒక కాలనీలో వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు, వేల కుటుంబాలు ఏర్పడినప్పుడు పాత పైప్లైన్ల సామర్థ్యం సరిపోకపోవచ్చని తెలిపారు. జనాభా పెరుగుదల, నీటి డిమాండ్, సాంకేతిక అవసరాల ఆధారంగా పంపిణీ లైన్లు, రిజర్వాయర్లు, పంపింగ్ వ్యవస్థలు, వాల్వులు, అంతర్గత నెట్వర్క్లను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
నీటి సరఫరా నిలిచిపోకుండా చర్యలు..
హైదరాబాద్కు కృష్ణా, గోదావరి తదితర దూరప్రాంత జలవనరుల నుంచి అనేక దశల్లో నీటిని పంపింగ్ చేసి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీ విద్యుత్ వ్యయం, పంపింగ్ స్టేషన్లు, ప్రధాన పైప్లైన్లు, నిరంతర పర్యవేక్షణ అవసరమవుతుందని పేర్కొన్నారు. జలమండలి సిబ్బంది రాత్రింబవళ్లు అప్రమత్తంగా పనిచేస్తూ నగరానికి నీటి సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత పరిష్కారం..
పైప్లైన్ ద్వారా అందించే నీటికి ట్యాంకర్ సరఫరాను శాశ్వత ప్రత్యామ్నాయంగా భావించరాదని ఎండీ సూచించారు. అపార్ట్మెంట్ సంఘాలు నీటి వినియోగంపై ఆడిట్ నిర్వహించడం, లీకేజీలను అరికట్టడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, పాడైన బోరుబావులను రీఛార్జ్ పిట్లుగా మార్చడం ద్వారా ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. సక్రమంగా ఏర్పాటు చేసిన రూఫ్టాప్ రేన్వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థల ద్వారా భూగర్భ జలాలు పునరుద్ధరించవచ్చని, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడి కనీసం కొన్ని నెలలపాటు ట్యాంకర్ అవసరం తగ్గుతుందని తెలిపారు.
Also Read: విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం.. 7 ప్రైవేట్ బస్సులు దగ్ధం!
వర్షిపు ప్రతి చుక్కను సంరక్షించాలి..
బీవర్లీ హిల్స్ లోని అపార్ట్మెంట్ వాసులు చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఎండీ అభినందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ కాలనీ ట్యాంకర్ నీటి అవసరం లేకుండా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్ ఇదే స్ఫూర్తితో ముందుకు వచ్చి వర్షపు ప్రతి చుక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి సైబరాబాద్ రీజినల్ ఈడీ సంతోష్, డైరెక్టర్ (ఆపరేషన్స్) నారాయణ, జీఎం హరి శంకర్, ఇంకుడుగుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ, అపార్టుమెంటు అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.