Train – Sandwich: రైలులో ఓ ఫ్యామిలీ శాండ్ విచ్ చేసుకొని తింటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే రైలులో ఇలా ఇష్టారీతిన వ్యవహరించడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను వ్యక్తిగత ఆస్తిగా భావించి.. బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం వారు చేసిన పనిని సమర్థిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఇన్ స్టాగ్రామ్ యూజర్ దివ్య జైన్ పోస్టు చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వివాదస్పదంగా మారింది. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు రైలులోని కోచ్ లో కూర్చొని.. శాండ్ విచ్ తయారు చేసుకుంటున్నారు. ఫ్యామిలీలో ఒకరు బ్రెడ్ పై క్రీమ్ రాస్తుంటే.. మరొకరు ప్లేటులో టమాటాలు కట్ చేస్తున్నారు. అలాగే కొన్ని కూరగాయల ముక్కలు కూడా ప్లేటులో కనిపించాయి. వారంతా రైలులో ఎంతో ఎంజాయ్ చేస్తూ శాండ్ విచ్ ను తింటూ కనిపించారు.
Railways should ban such people, they are menace in public places pic.twitter.com/m5F0XBcEfD
— Ritik (@ThenNowForeve) February 8, 2026
ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను అగౌరవ పరచడం, బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా దీనిని అభివర్ణిస్తున్నారు. మరికొందరు మాత్రం.. రైలులో ఇచ్చే నాశిరకం ఫుడ్ తినేకన్నా ఇలా ఫ్యామిలీతో కలిసి స్వయంగా చేసుకోవడం బెటరని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఇలా రైలులో ఫుడ్ తయారు చేసుకోవడం కన్నా.. ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
రైళ్లల్లో శుచి, శుభ్రత పాటించే విషయంలో కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరముందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రైలులోని తమ కంపార్ట్ మెంట్ ను ప్రైవేటుగా ఆస్తిగా భావించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇంకొక యూజర్ పేర్కొన్నాడు. మరొక యూజర్ ఆ కుటుంబాన్ని సమర్థిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగనంత వరకూ, రైలును అపరిశుభ్రం చేయనంతవరకూ వారు చేసిన దాంట్లో తప్పే లేదన్నారు. వాళ్లు తమ ఆహారాన్ని వారే చేసుకుంటే మిగతావారికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. మెుత్తంగా రైలులో శాండ్ విచ్ చేసుకున్న వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి కామెంట్స్ చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.