Road accident: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని శ్రీనగర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఒక ట్రాక్టర్, పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
పర్వతగిరి మండల కేంద్రంలోని నోట్రేడమ్ (Notre Dame) స్కూల్కు చెందిన బస్సు.. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత సుమారు 20 మంది విద్యార్థులను వారి ఇళ్లకు తీసుకెళ్తోంది. బస్సు శ్రీనగర్ స్టేజి సమీపానికి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి నేరుగా బస్సును ఢీకొట్టింది. ఈ ఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే.. ట్రాక్టర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. బస్సులో ఉన్న విద్యార్థులలో ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒక విద్యార్థి కాలు విరిగింది. మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వీరితో పాటు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను , ట్రాక్టర్లో ఉన్న వ్యక్తులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ములుగు అభివృద్ధి బాధ్యత నాది.. గెలిపించే బాధ్యత మీది.. మంత్రి సీతక్క