World’s Longest Railway Platform: భారతీయ రైల్వే ప్రపంచంలోనే ఎన్నో వింతలు, విశేషాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. సెమీ హైస్పీడ్ రైళ్లు, భారీ వంతెనలు, అత్యంత ఎత్తైన రైల్వే రూట్లతో పాటు, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్ కూడా భారత్ లోనే ఉంది. ఇంతకీ ఆ ప్లాట్ ఫారమ్ ఎక్కడుంది? దాని పొడవు ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్ కర్నాటకలో ఉంది. శ్రీ సిద్ధారూఢ స్వామిజీ హుబ్బళ్లి జంక్షన్ ఈ అరుదైన ఘనతను దక్కించుకుంది. సాధారణంగా హుబ్బళ్లి జంక్షన్ గా పిలిచే ఈ స్టేషన్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ లోని ప్లాట్ ఫారమ్ మొత్తం పొడవు 1,507 మీటర్లు ఉంటుంది. అంటే, ఒక చివర నుంచి మరో చివర వరకు నడవాలంటే సుమారు పావుగంటకు పైగా సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.
ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్పూర్ జంక్షన్ కు ఉండేది. అక్కడి ప్లాట్ ఫారమ్ పొడవు 1,366 మీటర్లు. అయితే, హుబ్బళ్లి స్టేషన్ లో నిర్మించిన కొత్త ప్లాట్ ఫారమ్ దానికంటే మరింత పొడవుగా ఉండటంతో కొత్త రికార్డు సాధించింది. గిన్నిస్ సంస్థ ఈ రికార్డును అధికారికంగా గుర్తించింది. 2023 మార్చిలో ఈ భారీ ప్లాట్ ఫారమ్ రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా మౌలిక వసతులను ఆధునీకరించే పనిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో హుబ్బళ్లి యార్డ్ ను పునర్నిర్మించారు.
ఈ ప్లాట్ ఫారమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టేషన్ లో చాలా పొడవైన రైళ్లు కూడా సులభంగా ఆగే అవకాశం లభించింది. రైళ్ల రాకపోకలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల భద్రత, క్రౌడ్ కంట్రోల్, వేగవంతమైన సేవలు అందించడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాట్ ఫారమ్ను డిజైన్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు కొనసాగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లాట్ ఫారమ్ పెరగడంతో ప్రయాణికులు సౌకర్యంగా వెళ్లే అవకాశం లభించింది.
హుబ్బళ్లి జంక్షన్ కర్ణాటకలో అత్యంత కీలకమైన రైల్వే కేంద్రాలలో ఒకటిగా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి బెంగళూరు, ముంబై, గోవా, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రతి రోజు వేలాది మంది ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తుంటారు.
Read Also: రూ.700 టికెట్ రూ.380కే ఇస్తానన్న టీటీఈ.. సోషల్ మీడియాలో దుమారం!