Dalit Farmer: స్వేచ్ఛ బ్యూరో: ఆరుకాలం శ్రమించి పండించిన వరి పంటను కోతకు సిద్ధమైన సమయంలో అర్ధరాత్రి కోసుకుపోయిన ఘటనపై నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన దళిత రైతు పొట్టోళ్ల ఎల్లయ్య కుటుంబాన్ని డీబీఎఫ్ నిజానిర్ధారణ బృందం పరామర్శించి ఘటనపై వివరాలు సేకరించింది.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పి. శంకర్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన పొట్టోళ్ల ఎల్లం కుటుంబానికి సర్వే నంబర్ 264/52ఏలో ఉన్న 1.20 గుంటల అసైన్డ్ భూమిలో సాగుచేసిన వరి పంటను ఆధిపత్య వర్గానికి చెందిన పాతూరి నర్సింహారెడ్డి అర్ధరాత్రి సమయంలో కోసుకుపోయాడని ఆరోపించారు. ఎల్లం కుటుంబం గతంలో నరసింహారెడ్డి వద్ద జీతం పని చేస్తూ కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుందని, అనంతరం వడ్డీపై వడ్డీ వేసి రూ.11 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా దళిత కుటుంబానికి చెందిన అసైన్డ్ భూమిని కుదవ పెట్టుకుని అన్యాక్రాంతానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ భూమిపై బాధిత కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, భూమి దళిత కుటుంబానికే చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వం కూడా పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసిందన్నారు.
Also read: సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ రెడీ.. ప్రారంభానికి డేట్ ఫిక్స్..!
2025 సంవత్సరం నుంచి మూడు పంటలను బాధిత కుటుంబమే సాగు చేస్తోందని వెల్లడించారు. అయితే ఈ నెల 4 మరియు 7 తేదీల రాత్రి సమయంలో నిందితులు దొంగచాటుగా వచ్చి వరి పంటను కోసుకుపోయారని ఆరోపించారు. ఈ విషయమై దౌల్తాబాద్ ఎస్సైకి ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు బీఎన్ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కోసుకుపోయిన వరి పంటను తిరిగి బాధిత కుటుంబానికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యం కొనసాగిస్తే దళిత సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.
Alao read: అల్లు అర్జున్నే వదలలేదు.. బండి సంజయ్ కొడుకు ఎంత: సామ రామ్మోహన్ రెడ్డి