Mumbai Air Travel Faces Disruptions: ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానాలకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇండిగో తాజా ప్రకటనలో, ముంబైలోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపింది. వర్షాల కారణంగా కొన్ని విమానాలు ఆలస్యం కావడంతో పాటు షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది. సో, ప్రయాణికులు ఇండిగో అధికారిక వెబ్ సైట్ లేదంటే మొబైల్ యాప్ లో విమాన వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించింది. ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించింది.
మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైతో పాటు థానే, రాయగడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముందుగా జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ ను పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో రెడ్ అలర్ట్ గా మార్చింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. రోడ్లు, వంతెనలపైకి నీరు చేరే ప్రమాదంతో పాటు పాత భవనాలు, చెట్లు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాల ప్రభావంతో రోడ్డు, రైలు, విమాన, ఫెర్రీ రవాణా సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలపై కూడా ప్రభావం పడొచ్చన్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ప్రయాణం చేయాల్సి వస్తే ముందుగా ట్రాఫిక్ పరిస్థితులు, వాతావరణ సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద లేదా బలహీనమైన నిర్మాణాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: రైల్వే ట్రాక్ పై విరిగిపడ్డ కొండచరియలు.. 16 రైళ్లు రద్దు, 9 దారిమళ్లింపు!