IRCTC Boarding Point: రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణానికి అరగంట ముందు కూడా బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ బోర్డింగ్ స్టేషన్ మార్పుకోవాలంటే 24 గంటల ముందు మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు ఏదైనా కారణం వల్ల బోర్డింగ్ స్టేషన్లో రైలు ఎక్కలేకపోతే.. జర్నీకి 30 నిమిషాల ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య విడతల వారీగా ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
బోర్డింగ్ పాయింట్ రూల్స్ ప్రకారం.. ఇకపై ఫస్ట్ ఛార్ట్ లో ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ పేరు కనిపించదు. ట్రైన్ బయల్దేరడానికి ముందు విడుదల చేసే సెకండ్ రిజర్వేషన్ ఛార్టులో మాత్రమే బోర్డింగ్ స్టేషన్ వివరాలు కనిపిస్తాయి. కన్ఫామ్ లేదా ఆర్ఏసీ (RAC) టికెట్ ఉన్నప్పుడు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ మార్చుకోలేరు. అలాగే ఒక టికెట్కు ఒకసారి మాత్రమే బోర్డింగ్ పాయింట్ మార్చుకొనే సదుపాయం ఉంటుంది.
ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు ఐఆర్సీటీసీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి
ఆ తర్వాత My Account > My Transactions > Booked Ticket Historyలోకి వెళ్లండి.
బోర్డింగ్ పాయింట్ మార్చుకునే టికెట్ పీఎన్ఆర్ ను సెలెక్ట్ చేయండి.
‘Change Boarding Point’ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి.
బోర్డింగ్ పాయింట్ ఛేంజ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఆఫ్లైన్లో టికెట్ కొంటే దగ్గర్లోని రైల్వే కౌంటర్కి వెళ్లి టికెట్, గుర్తింపు కార్డు చూపించి బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.
Also Read: వామ్మో IRCTC ఏజెంట్ ఇంత సంపాదిస్తాడా? అస్సలూ ఊహించి ఉండరు!