East Godavari: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కించ పరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులపై నోరు విప్పారు సీఎం చంద్రబాబు. ఆ విధంగా చేసినవారికి నాయకులు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. మీ ఇంట్లో కుటుంబం లేదా? ఇంట్లో ఉండే ఆడ పిల్లలకు రక్షణ అవసరం లేదా? ఏమనుకుంటున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.
యూట్యూబ్ మొదలు, సోషల్ మీడియా అంతటా తప్పుడు వార్తలు ప్రస్తారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పుడు వార్తలైతే ఖండిస్తారని, క్యారెక్టర్ని చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఇక్కడ ఉండరని, , ఎక్కడో ఉంటారని అన్నారు. అలాంటి వాళ్లకు నేతలు ఫండింగ్ చేస్తున్నారని రుసరుసలాడారు. మొన్నటి ఎన్నికల్లో గోదావరి జిల్లాల గురించి చూశామని, కళ్లు అదిరే మెజార్టీ ఇచ్చారని, కూటమిపై ఉండే అభిమానం ఇదేనన్నారు.
రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇంకొంచెం ఎక్కువ ఉంటారన్నారు. అదే సమయంలో తోపులాటలు ఉంటాయన్నారు. భుజం ఆపరేషన్ నుండి ఆయన వేగంగా కోలుకుంటున్నారని, పనిలోకి వస్తానంటే వద్దు అని వారించానని తెలిపారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానని వివరించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే గోదావరి జిల్లాలకు నీటి ఎద్దడి ఉండదన్నారు సీఎం చంద్రబాబు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పోలవరాన్ని ఏపీ జీవనాడిగా వర్ణించిన ఆయన, గతంలో 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కాటన్ కట్టిన ప్రాజెక్టు వల్ల దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.
సోమవారం గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ ఉదయం ధవలేశ్వరం బ్యారేజీ నూతన గేట్లు అమర్చేందుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.