Hyderabad-Mumbai High Speed Rail: హైదరాబాద్- ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక ముందుడుగు పడింది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గించే, ఈ ప్రాజెక్టు డీపీఆర్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రయాణానికి సుమారు 15 గంటల సమయం పడుతుండగా, ప్రతిపాదిత హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ పూర్తయితే కేవలం 3 గంటలలోపు ముంబైకి చేరుకునే అవకాశం ఉంటుంది.
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయి. ఈ హైస్పీడ్ రైలు గంటకు గరిష్ఠంగా 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీంతో హైదరాబాద్ నుంచి ముంబైకి తక్కువలో తక్కువ 2 గంటల 55 నిమిషాలు, ఎక్కువలో ఎక్కువ 3 గంటల 13 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, మహారాష్ట్రలో అత్యధికంగా 457 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు సర్వే దశలో ఉండగా, హైదరాబాద్–పుణె–ముంబై ప్రాజెక్టు మాత్రం డీపీఆర్ దశకు చేరింది.
హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులోబోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. మహారాష్ట్రలో 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం నిర్మించనున్నారు. ఖండాల ఘాట్ ప్రాంతంలో 13 చోట్ల కొండలను తొలిచి సొరంగాలు నిర్మిస్తారు. మొత్తం సొరంగాల పొడవు 24 కిలోమీటర్లు ఉంటుంది. నగరాల్లో మెట్రో మాదిరిగా పిల్లర్లపై ట్రాక్ నిర్మిస్తారు. కొండలు, నదులు, భూగర్భ ప్రాంతాల మీదుగా ఈ మార్గం సాగనుంది. ఈ మార్గంలో మొత్తం 101 వంతెనలు నిర్మించనున్నారు. వాటిలో 13 స్టీల్ బ్రిడ్జ్ లు ఉంటాయి. నదులపై భారీ వంతెనలను కూడా ప్రతిపాదించారు. ములా-ముఠా నదిపై 360 మీటర్ల పొడవైన వంతెన, భీమా నదిపై 280 మీటర్ల వంతెన నిర్మించనున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ కోకాపేట, వికారాబాద్లలో స్టేషన్లు ప్రతిపాదించారు. తాజాగా శంషాబాద్ సమీపంలో కూడా మరో స్టేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కర్ణాటకలో కలబురిగి, మహారాష్ట్రలో పుణె, థానే, నవీ ముంబై, లోనావాలా, సోలాపూర్, బారామతి, పంఢర్పూర్, పింప్రిచించ్వాడ్, విఖ్రోలి లాంటి ప్రాంతాల్లో స్టేషన్లు ఉండనున్నాయి. ప్రతిపాదిత స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండనున్నాయి. ప్రతి స్టేషన్ నిర్మాణానికి భారీ స్థాయిలో భూమి అవసరం అవుతోంది. భవనాలు, పార్కింగ్, ఇతర సదుపాయాల కోసం ఒక్కో స్టేషన్ కు దాదాపు 247 ఎకరాల భూమి కావాలని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోకాపేట, వికారాబాద్ స్టేషన్ల కోసం ఇప్పటికే భూసేకరణపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో ప్రత్యేక డిపో ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో బుల్లెట్ రైలులో 16 బోగీలు ఉండగా, ఒకేసారి 1,215 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ముంబైలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబైకి శరవేగంగా ప్రయాణాలు కొనసాగున్నాయి. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రారంభ సంవత్సరంలో రోజుకు 63 వేల మందికి పైగా ఈ రైలును ఉపయోగిస్తారని, 2061 నాటికి ఈ సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: ఈ విమానానికి పెట్రోల్ అవసరం లేదు.. నీటితోనే ఎగిరిపోతుంది!