Made in India Bullet Train B28: భారతీయ రైల్వే మరో కీలక అడుగు వేయబోతోంది. ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో హైస్పీడ్ రైలును తయారు చేసే దిశగా ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్టుకు B28 అనే పేరు పెట్టింది. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థ దీనిని తయారు చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా దీనిని రూపొందిస్తున్నారు.
B28 రైలు గంటకు గరిష్టంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. సాధారణంగా భారతదేశంలో నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్లు 100 నుంచి 130 కి.మీ. వేగంతో నడుస్తుంటే, వందే భారత్ రైళ్లు 180 కి.మీ. వరకు మాత్రమే చేరుకుంటాయి. కానీ B28 వాటికంటే చాలా వేగంగా ప్రయాణించే సామర్థ్యంతో వస్తోంది. ప్రారంభ దశలో ఈ రైలు ఆపరేటింగ్ స్పీడ్ను సుమారు 250 కి.మీ.గా ఉంచే అవకాశం ఉంది. ఈ రైలు మొత్తం 8 బోగీలతో రూపొందించబడుతోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సీట్లు, ఆధునిక భద్రతా వ్యవస్థలు, తక్కువ శబ్దంతో ప్రయాణ అనుభవం కల్పించే విధంగా డిజైన్ చేస్తున్నారు. హైస్పీడ్ ట్రాక్లకు అనుగుణంగా ఏరోడైనమిక్ డిజైన్ను కూడా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల వేగంగా ప్రయాణించినప్పటికీ రైలుకు స్థిరత్వం ఉంటుంది.
ప్రస్తుతం ఈ రైలుకు సంబంధించిన పనులు బెంగళూరులోని BEML ఆదిత్య కాంప్లెక్స్ లో కొనసాగుతున్నాయి. మొదటి ప్రోటో టైప్ ను 2027 మార్చి నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ట్రయల్ రన్స్ నిర్వహించి, అన్ని పరీక్షలు విజయవంతమైతే 2027 ఆగస్టు నాటికి సూరత్–వాపి మార్గంలో టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. B28 రైళ్లను ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లో ఉపయోగించే అవకాశముంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో జపాన్ టెక్నాలజీ ఆధారంగా బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ, స్వదేశీ B28 సక్సెస్ అయితే భారత్కు పెద్ద స్థాయిలో ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, రైల్వే టెక్నాలజీలో దేశీయ నైపుణ్యం కూడా పెరుగుతుంది.
అటు B28 తర్వాత B35 అనే మరింత వేగవంతమైన రైలును కూడా అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అది గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించేలా ఉండొచ్చని సమాచారం. అంటే భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోని హైస్పీడ్ రైలు సేవలు కలిగిన దేశాల సరసన నిలబడే అవకాశం ఉంది. స్వదేశీ బుల్లెట్ ట్రైన్ తయారీ భారత్కు కేవలం రవాణా రంగంలోనే కాకుండా సాంకేతిక రంగంలో కూడా పెద్ద విజయంగా భావిస్తున్నారు. విదేశీ టెక్నాలజీ కొనుగోలు చేయడం కంటే, మన దేశంలోనే రూపకల్పన చేసి తయారు చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, తయారీ రంగానికి కూడా ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.
Read Also: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పక్కనే బుల్లెట్ ట్రైన్ హబ్.. రైల్వే కీలక నిర్ణయం!