భారతీయ విమానయాన రంగంలో గతంలో ఎప్పుడూ లేని సంక్షోభానికి కారణం అయిన ఇండిగో సంస్థపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఎందుకు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ డీజీసీఏ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఇండిగో స్పందించింది. ఒక్కసారిగా ఎందుకు ఆపరేషన్స్ లో అంతరాయం ఏర్పడిందో చెప్పాలంటూ ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చింది. డిసెంబర్ 8, 2025న సాయంత్రం 6:00 గంటలకు ఇండిగో CEO, COO ఇద్దరూ సంతకం చేసిన వివరణ లేఖను DGCAకు సమర్పించారు.
పెద్ద సంఖ్యలో విమానాలు రద్దుతో ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులకు ఇండిగో క్షమాపణలు చెప్తున్నట్లు వెల్లడించింది. అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నట్లు తెలిపింది. కొన్ని దురదృష్టకర, ఊహించని పరిమాణాల కారణంగానే విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు అయినట్లు వెల్లడించింది. పెద్ద సంఖ్యలో ఆపరేషన్స్ నిలిచిపోయిన నేపథ్యంలో కచ్చితమైన కారణాన్ని ఇప్పుడే నిర్థారించడం కష్టం అని తెలిపింది.
DGCA మాన్యువల్ SCNలకు పదిహేను రోజుల రెస్పాన్స్ పీరియడ్ అందిస్తుందని, అయితే, కంప్లీట్ రూట్ కాజ్ విశ్లేషణ (RCA) కోసం మరికాస్త సమయం పడుతుందని ఇండిగో తెలిపింది. RCA పూర్తయిన తర్వాత ఇండిగో ఆపరేషన్స్ యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఆపరేషన్స్ ఫెయిల్యూర్స్ కు గల కారణాలను ప్రస్తావించింది.
⦿ చిన్న సాంకేతిక లోపాలు
⦿ శీతాకాలం ప్రారంభంలో షెడ్యూల్ మార్పులు
⦿ ప్రతికూల వాతావరణ పరిస్థితులు
⦿ విమానయాన వ్యవస్థలో పెరుగుతున్న రద్దీ
⦿ కొత్త సిబ్బంది రోస్టరింగ్ నియమాల అమలు
ఈ కారణాలతోనే తమ కంపెనీకి చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు అయ్యాయని ఇండిగో విమానయాన సంస్థ DGCAకు వివరణ ఇచ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్(FDTL) ఫేజ్ IIకు అమలుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి DGCAతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. ఈ రూల్స్ నుంచి కొద్ది రోజులు మినహాయింపులు, పొడిగింపులను కోరుతున్నామని ఇండిగో తెలిపింది. నిజానికి తమ కంపెనీకి సంబంధించి అంతరాయాలు డిసెంబర్ ప్రారంభంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆన్ టైమ్ నెట్ వర్క్ పని తీరు ను తగ్గించడానికి కారణమైందన్నారు. అదే సమయంలో సిబ్బంది సరిపడ లేకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అయినట్లు తెలిపింది. త్వరలోనే సమస్యను పరిష్కరించబోతున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఇండిగో క్రైసిస్ ఇంకా కొనసాగుతోంది. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన 14 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్ కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్పైస్ జెట్ విమానయాన సంస్థ దేశ వ్యాప్తంగా 100 అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. అటు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణీకలకు ఇబ్బంది కలగకుండా రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది.
Read Also: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!