Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం మరో ప్రకటన చేసింది. మంగళవారం లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని, భద్రత పూర్తిగా అమలులో ఉందన్నారు.
ఇండిగో సంక్షోభం కేంద్రం కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభంపై ప్రతీ రోజు ప్రకటన చేస్తోంది కేంద్రం. ఆ సంస్థలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి, తీసుకున్న చర్యలను వివరిస్తోంది. సోమవారం రాజ్యసభలో దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. మంగళవారం లోక్సభలో ఆయన ఓ ప్రకటన చేశారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించ బడుతున్నాయన్నారు. వాటి భద్రత పూర్తిగా అమలులో ఉందన్నారు. ఇండిగో విమాన సంస్థ జవాబుదారీగా ఉందన్నారు.
ఎయిర్పోర్టుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి క్రమంగా చేరుకుంటున్నట్లు వివరించారు. రిఫండ్, లగేజీని ప్రయాణికులకు చేర్చే చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇండిగో యాజమాన్యానికి డీజీసీఏ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చిందని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని తేల్చేశారు. పౌర విమానయానంలో భద్రత విషయంలో బేరసారాలు లేవని వక్కానించారు సదరు మంత్రి.
లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్-పైలట్ల పని గంటలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఆ సంస్థ సంక్షోభానికి ప్రధాన కారణంగా వార్తల నేపథ్యంలో దీనిపై స్పందించారు. ఈ అంశంపై మాట్లాడిన మంత్రి.. సంస్కరణలు ప్రయాణికుల భద్రతను పెంచుతాయని గుర్తు చేశారు. పైలట్ల అలసటను దృష్టిలో పెట్టుకొని వాటిని రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ విషయంలో తాము అన్ని విమానయాన సంస్థలతో చర్చించామని, ఆ తర్వాత డీజీసీఏ వీటిని దశలవారీగా అమలు చేస్తోందన్నారు. ఈ ఏడాది జులై ఒకటి నుంచి తొలి దశ అమలైందన్నారు. నవంబరు ఒకటి నుంచి రెండో దశను అమలుచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నిబంధనలను పాటిస్తామని ఇండిగో ఎయిర్లైన్స్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ALSO READ: ఇండిగో సంక్షోభం.. నోరు విప్పిన ప్రధాని
ఇండిగో హామీ ఇచ్చినప్పటికీ, రోస్టరింగ్ నియమాలను అమలుచేయడంలో రద్దుకు దారి తీసిందన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పకనే చెప్పారు. సర్వీసుల రద్దు వేళ టికెట్ ఛార్జీలపై పరిమితులు విధించామన్నారు. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడం లేదని తేల్చేశారు. మరిన్ని విమానయాన సంస్థలను ఆహ్వానిస్తున్నామని, కొత్త సంస్థలు అడుగు పెట్టడానికి ఇదే సరైన సమయమన్నారు.
ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన..
ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించాము
ఇండిగో సీఈఓ, సీఓఓలకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇచ్చింది
నిబంధనలు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తాం
– రామ్మోహన్ నాయుడు pic.twitter.com/3UTAD3yb5h
— BIG TV Breaking News (@bigtvtelugu) December 9, 2025