ISRO Chief on Indian Railways: దేశాభివృద్ధిలో భారతీయ రైల్వేల పాత్ర అద్భుతం అని ప్రశంసించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి డాక్టర్ వి. నారాయణన్. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (IRISET) తో అనుబంధం కలిగి ఉండటం చాలా మంది ఇంజనీర్లకు ఒక కల అన్నారు. హైదరాబాద్లోని మెట్టుగూడలో ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (IRISET) 68వ వార్షికోత్సవానికి నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైల్వేకు శుభవార్త చెప్పారు. త్వరలో రైల్వేకు సంబంధించి ఓ కీలక కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. భారతీయ రైల్వే నెట్ వర్క్ లోని అన్ని రైళ్ల రియల్ టైమ్ మానిటరింగ్ కు ఈ వ్యవస్ ఉపయోగపడనున్నట్లు తెలిపారు.
అటు ఇండియన్ రైల్వే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ఆర్గనైజేషన్ మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయని నారాయణన్ చెప్పుకొచ్చారు. రెండింటినీ కచ్చితత్వంతో, సమయస్ఫూర్తితో నడపకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. సురక్షితమైన రైల్వే కార్యకలాపాలకు కమ్యూనికేషన్ చాలా కీలకమని, అవసరమైన కమ్యూనికేషన్ సపోర్టును అందించడంలో ఇస్రో ఉపగ్రహాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త సాంకేతికతను భారతీయ రైల్వేకు ఇస్రో అందించబోతుందన్నారు.
నిత్యం లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తారని, టైమింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా, సిగ్నల్ తప్పినా పెను ప్రమాదాలు జరిగి ఎంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు నారాయణన్. రైల్వే సిగ్నల్ ఇంజినీర్, లోకో పైలెట్, స్టేషన్ మాస్టర్ అందరూ ప్రతి సెకను అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే సమయంలో ఇస్ట్రో పెద్ద మొత్తంలో ఖర్చు చేసి రాకెట్ పంపితే, లాంచింగ్ సమయంలో ఏమాత్రం అటు ఇటూ అయినా పేలిపోవచ్చన్నారు. ఒక్క మిల్లీ మీటరు కక్ష్య తప్పినా శాటిలైట్ లక్ష్యం చేరుకోదన్నారు. రెండు సంస్థల విజయానికి మూలం పటిష్టమైన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థ అన్నారు. రెండు సంస్థల మధ్య టెక్నాలజీ సహకారం ఉందని.. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందన్నారు నారాయణన్.
Indian Railways Institute of Signal Engineering & Telecommunications, (IRISET) celebrated its 68th Annual Day today i.e., 24th November, 2025. Dr. V. Narayanan, Secretary, Department of Space and Chairman, Indian Space Research Organization (ISRO) delivered the key note address pic.twitter.com/NhpL48emr2
— South Central Railway (@SCRailwayIndia) November 24, 2025
అటు రైల్వే బోర్డు ఛైర్మన్, CEO సతీష్ కుమార్ కు సంబంధించిన రికార్డింగ్ మెసేజ్ లో.. రైల్వే కార్యకలాపాలలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అధికారులు, పర్యవేక్షకులలో వందశాతం కచ్చితత్వం ఉందన్నారు. IRISET రైల్వే సిబ్బందికి మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగ నిపుణులకు కూడా అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. అటు ఈ సంస్థను కార్మికులకు సంబంధించి మల్టీ స్కిల్స్ పెంపొందించడంలోకీలక పాత్ర పోషిస్తుందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ ను మెరుగుపరుచుకోవడంలో మరింత చొరవ తీసుకోవాలని సూచించారు.
Read Also: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?