Kedarnath Helicopter Services 2026: ఈ ఏడాది కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ సేవలకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ పూర్తిగా ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ బుకింగ్ కోసం IRCTC ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ (UCADA) కీలక ప్రకటన చేసింది. టిక్కెట్ బుకింగ్ కు సంబంధించిన పోర్టల్ ఏప్రిల్ 10 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇకపై ఆఫ్ లైన్ బుకింగ్, మధ్యవర్తుల అవసరం లేకుండా, భక్తులు నేరుగా అధికారిక వెబ్ సైట్ ద్వారానే టిక్కెట్లు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తొలుత ఈ సర్వీసులకు సంబంధించిన టిక్కెట్లు 20 రోజుల ప్రయాణ కాలానికి మాత్రమే విడుదల చేయనున్నారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభానికి ముందు ఈ వ్యవస్థను అమలు చేయడం ద్వారా పారదర్శకతను పెంచడం, యాత్రికులకు సౌకర్యాన్ని కల్పించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరల సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఈ కొత్త విధానం ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించనుంది.
ఈ ఏర్పాట్లపై చర్చించేందుకు UCADA సీఈవో డాక్టర్ ఆశిష్ చౌహాన్ నేతృత్వంలో IRCTC అధికారులతో సమావేశం జరిగింది. ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానున్న హెలికాప్టర్ షటిల్ సేవలు సజావుగా నడవడానికి అవసరమైన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సీజన్లో గుప్తకాశి, సిర్సి, ఫాటా లాంటి ప్రధాన హెలిప్యాడ్ల నుంచి సేవలు అందించేందుకు ఎనిమిది ఆపరేటర్లను ఎంపిక చేశారు.
ఈసారి మరో ముఖ్యమైన విషయం రీఫండ్ వ్యవస్థ. వాతావరణ పరిస్థితుల వల్ల హెలికాఫ్టర్ సర్వీసులు రద్దు అయిన సందర్భాల్లో గతంలో ప్రయాణికులు డబ్బు తిరిగి పొందడంలో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా వెంటనే రీఫండ్ ప్రాసెస్ చేయాలని నిర్ణయించారు. అవసరమైన సందర్భాల్లో ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందించేందుకు ప్రత్యేక నోటీసులు కూడా జారీ చేయనున్నారు.
100% ఆన్లైన్ బుకింగ్ విధానం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా, టిక్కెట్ల దుర్వినియోగం తగ్గనుంది. మధ్యవర్తులు, అనధికార ఏజెంట్ల జోక్యం లేకుండా, నేరుగా అధికారిక పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవడం వల్ల భక్తులకు భద్రత పెరుగుతుంది. అలాగే, ప్రయాణికుల వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా యాత్ర నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
ఇక యాత్ర విషయానికి వస్తే, ఈ నెలాఖరులో కేదార్నాథ్ ఆలయం తెరుచుకోనుంది. దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, నడవలేని భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్లలో సదుపాయాలు, భద్రతా చర్యలు, ప్రయాణికుల సేవలను మెరుగుపరుస్తున్నారు.
Read Also: రైల్వేలో నీళ్ల కుంభకోణం.. ఇలా మోసం చేస్తున్నారా? ఐఆర్సీటీసీ గుట్టురట్టు.. సీఐసీ గుర్రు!