Rail Neer Scam Controversy: రైల్వే క్యాటరింగ్ సంస్థ ఐఆర్సీటీసీపై కేంద్ర సమాచార కమిషన్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్ నీర్ కుంభకోణానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ దాఖలైన ఆర్టీఐ రిక్వెస్ట్ ను ఐఆర్సీటీసీ తిరస్కరించడంపై సీరియస్ అయ్యింది. ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో చెప్పాలని ఆదేశించింది.
రీసెంట్ గా ఆర్టీఐ కింద ఓ కీలకమైన ప్రశ్న అడిగారు. రైల్వే టెండర్లలో పాల్గొనే కంపెనీలు తమపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల వివరాలను టెండర్ పేపర్లలో వెల్లడించాయా? లేదా? అని తెలుసుకోవాలనుకున్నట్లు ఓ వ్యక్తి దరఖాస్తు చేశాడు. ముఖ్యంగా 2015లో వెలుగులోకి వచ్చిన రైల్ నీర్ కుంభకోణంలో ఈ కంపెనీలకు సంబంధం ఉందా? అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ అప్లికేషన్ పెట్టాడు. నిజానికి రైల్ నీర్ కేసు అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రీమియం రైళ్లలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన రైల్వే నీటికి బదులుగా, కొంతమంది ప్రైవేట్ క్యాటరింగ్ సంస్థలు చౌక బాటిల్ వాటర్ సరఫరా చేశాయి. దీని వల్ల రైల్వేకు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు సీబీఐ విచారణలో బయటపడింది.
ఈ నేపథ్యంలో ఆర్టీఐ దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నల్లో కీలక ప్రశ్నలు అడిగాడు. కంపెనీలు తమపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు అయిందని ప్రకటించాయా? ఈడీ కేసులు ఉన్నాయా? దాడులు, నగదు స్వాధీనం లాంటి అంశాలు అధికారులకు తెలియజేశారా? కోర్టులో చార్జ్షీట్ దాఖలు అయ్యిందా? లాంటి కీలక విషయాలు వెల్లడించాయా? అని కోరాడు.
అయితే, ఈ సమాచారాన్ని ఐఆర్సీటీసీ ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(డి) ప్రకారం ఇది కమర్షియల్ రహస్యాలకు సంబంధించిన సమాచారం కాబట్టి ఇవ్వలేమని తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం, ఒక సంస్థకు చెందిన వ్యాపార రహస్యాలు బయటపెడితే, వారి పోటీ స్థితికి నష్టం కలిగే అవకాశం ఉంటే, ఆ సమాచారాన్ని ఇవ్వకుండా మినహాయింపు ఇవ్వవచ్చు.
ఐఆర్సీటీ తీరుపై అసంతృప్తి చెందిన దరఖాస్తుదారుడు అప్పీల్కు వెళ్లారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వాదించారు. ప్రభుత్వ టెండర్లలో పాల్గొనే సంస్థలు పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయా? లేదా? అనేది ప్రజలకు తెలియాల్సిన హక్కు ఉందన్నారు. అయితే, విచారణలో ఐఆర్సీటీసీ అధికారులు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాము చట్టం ప్రకారం సరైన సమాధానం ఇచ్చామని, మొదటి అప్పీలేట్ అథారిటీ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించిందని చెప్పారు.
ఈ వాదనలను పరిశీలించిన సీఐసీ మాత్రం ఐఆర్సీటీసీ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఒక సెక్షన్ను చూపిస్తూ సమాచారం ఇవ్వకుండా ఉండటం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. ఎందుకు ఆ సమాచారం ఇవ్వలేరో స్పష్టమైన కారణాలు చెప్పాల్సిన బాధ్యత ఉందని సూచించింది.
Read Also: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!