Maitrivanam Fire Incident: అమీర్ పేటలోని మైత్రివనం సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) స్పష్టత ఇచ్చింది. ఈ ఘటన కారణంగా మెట్రో రైల్ వ్యవస్థకు ఎలాంటి నిర్మాణాత్మక నష్టం జరగలేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మెట్రో ఫిల్లర్స్, ట్రాక్స్, స్టేషన్లు సహా దేనికీ ఇబ్బంది కలగలేదని వెల్లడించారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం మెట్రో మార్గానికి సమీపంలో ఉండటంతో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రాథమిక పరిశీలనలో ఎలాంటి ప్రమాదకర ప్రభావం కనిపించలేదని అధికారులు తెలిపారు. ఎటువంటి పగుళ్లు, డ్యామేజ్, నిర్మాణ లోపాలు లేవని స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తున్నాయని, మెట్రో సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు.
దట్టమైన పొగ కారణంగా కొంతమేర ప్రయాణికులకు అసౌకర్యం కలిగినా.. రైళ్ల రాకపోకలు మాత్రం నిరాటంకంగా కొనసాగాయని HMRL వెల్లడించింది. సిగ్నలింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, ట్రాక్ కంట్రోల్ లాంటి కీలక భాగాలపై ఎలాంటి ప్రభావం పడలేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాల ప్రకారం అన్ని వ్యవస్థలను పరిశీలించిన తరువాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.
అగ్నిప్రమాద ప్రభావం మెట్రో ఫిల్లర్స్ కు అమర్చిన యాడ్స్ బోర్డుల వినైల్ షీట్లకు మాత్రమే పరిమితమైందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల వినైల్ షీట్స్ వేడి, పొగ కారణంగా స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే, ఇది కేవలం చిన్న స్థాయి నష్టం మాత్రమేనని, దీని వల్ల మెట్రో వ్యవస్థ పనితీరుపై ఎలాంటి ప్రభావం లేదని వివరించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సాంకేతిక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. ప్రతి భాగాన్ని విడివిడిగా తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకున్న తరువాతే సాధారణ కార్యకలాపాలను కొనసాగించినట్టు తెలిపారు. అవసరమైన చోట తాత్కాలిక శుభ్రపరిచే పనులు కూడా చేపట్టినట్లు సమాచారం. మెట్రో రైల్ సేవలు నగరంలో రోజువారీ ప్రయాణికులకు కీలకంగా ఉండటంతో, ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను కొనసాగించడం ముఖ్యమని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మొత్తం పరిశీలన అనంతరం, హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థకు నిర్మాణాత్మకంగా, కార్యకలాపాల పరంగా ఎలాంటి నష్టం జరగలేదని HMRL స్పష్టం చేసింది. నగర ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనవకుండా సాధారణంగా మెట్రో సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు.
Read Also: టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!