Duronto Express Hygiene Row: భారతీయ రైల్వేల్లో ఆహార పరిశుభ్రతపై మరోసారి తీవ్రస్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో, రైల్వే క్యాటరింగ్ సేవలను నిర్వహిస్తున్న ఐఆర్సిటిసి(IRCTC) కి భారత ఆహార భద్రతా సంస్థ FSSAI నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోలో రైలు టాయిలెట్ ఏరియాలో పేట్లు కడుగుతున్నట్లు కనిపించడంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) నుంచి ఎర్నాకులం వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రైలులో క్యాటరింగ్ సేవలు అందించే సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు టాయిలెట్ సమీపంలో పాత్రలను శుభ్రం చేస్తున్నట్లు వీడియోలో కనిపించిందని FSSAI వెల్లడించింది. ఇలాంటి చర్యలు నిజమైతే ఆహార భద్రతా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ముఖ్యంగా టాయిలెట్ ప్రాంతంలో పాత్రలు కడగడం వల్ల ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ప్రజారోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని IRCTCని FSSAI ఆదేశించింది. అలాగే ఈ సేవలను నేరుగా IRCTC నిర్వహిస్తోందా? లేక ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహిస్తున్నారా? అనే విషయాన్ని కూడా వెల్లడించాలని కోరింది. సంబంధిత కాంట్రాక్టర్ వివరాలు, FSSAI లైసెన్స్ నంబర్, సిబ్బందిపై తీసుకున్న చర్యల వివరాలను కూడా సమర్పించాలని సూచించింది.
అంతేకాదు, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని FSSAI కోరింది. అదేవిధంగా క్యాటరింగ్ సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రతపై శిక్షణ ఇచ్చారా? లేదా? అనే వివరాలను కూడా అడిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
రైల్వే ప్రయాణికులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని FSSAI తేల్చి చెప్పింది. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల ఆరోగ్యంపై మాత్రమే కాకుండా రైల్వే క్యాటరింగ్ సేవలపై ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయని తెలిపింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించి, వెంటనే సమాధానం ఇవ్వాలని IRCTCకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై IRCTC నుంచి అధికారిక వివరణ కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. రైల్వేల్లో ఆహార పరిశుభ్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.