Palace on Wheels Struggles: భారత్ లో అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ ప్రస్తుతం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కిటకిటలాడే ఈ రైలు ఇప్పుడు ఖాళీ సీట్లతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం కారణంగా అంతర్జాతీయ పర్యాటకులు ప్రయాణాలకు వెనుకాడుతుండటమే దీనికి ప్రధాన కారణం.
1982లో ప్రారంభమైన ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు రాజస్థాన్ పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. రాజస్థాన్ లోని కోటలు, రాజభవనాలు, ఎడారి ప్రాంతాలు, చారిత్రక నగరాలను విలాసవంతమైన రైలులో చూపించే ఈ ప్రయాణం విదేశీయులను ఎంతగానో ఆకర్షించేది. ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ ట్రైన్లలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
ఈ సీజన్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల జైసల్మేర్ కు వెళ్లిన చివరి ట్రిప్లో 84 మంది ప్రయాణికులు కూర్చోగల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించారు. ఆక్యుపెన్సీ భారీగా పడిపోయింది. ప్రయాణికుల కొరత కారణంగా ఆ తర్వాత జరగాల్సిన రెండు ప్రయాణాలను కూడా అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది. ఈ రైలు నిబంధనల ప్రకారం.. ఒక ట్రిప్ వెళ్లాలంటే.. కనీసం 14 క్యాబిన్లు బుక్ కావాలి. కానీ, ఈ సీజన్లో అనేక సందర్భాల్లో 10 బుకింగ్లు కూడా రాకపోవడంతో క్యాన్సిలేషన్స్ తప్పలేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 32 ట్రిప్లు నిర్వహించాలనే టార్గెట్ ఉన్నా.. అందులో 10 ట్రిప్ లు క్యాన్సిల్ అయ్యాయి.
43 ఏళ్ల చరిత్రలో ఒకే సీజన్ లో ఇంత పెద్ద స్థాయిలో ట్రిప్స్ క్యాన్సిల్ జరగడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో పలు ట్రిప్లు రద్దయ్యాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు ఈ లగ్జరీ రైలును ప్రభావితం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ రైలు పూర్తిగా కోలుకోలేకపోయిందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. 2022లో సేవలు పునఃప్రారంభించిన తర్వాత రైలును అత్యాధునికంగా అప్ డేట్ చేశారు. ఇంటీరియర్లను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఫైవ్ స్టార్ హోటల్ స్థాయి సౌకర్యాలు కల్పించారు. అయినప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగలేదు.
టికెట్ ధరలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. ఈ రైలులో ప్రయాణించాలంటే ఒక్కో ప్రయాణికుడు రూ.6 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలు కూడా ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు రాజస్థాన్ పర్యాటకానికి ప్రతీకగా నిలిచిన ప్యాలెస్ ఆన్ వీల్స్ ఇప్పుడు ప్రపంచ పరిస్థితుల ప్రభావంతో కుదేలవుతోంది.
Read Also: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి 1,000 కొత్త జనరల్ కోచ్లు!