Railway Pass: సాధారణంగా రైల్వే ఉద్యోగులకు రైలు ప్రయాణాల్లో మినహాయింపులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల కోసం పలు రకాల పాస్ లను రైల్వేశాఖ జారీ చేస్తుంటుంది. అయితే ఈ పాస్లు ఉన్నంత మాత్రాన వారు అన్ని రైళ్లలోనూ ఉచితంగా ప్రయాణించవచ్చా అంటే లేదనే చెప్పాలి. రైల్వే ఉద్యోగుల పాస్ నిబంధనలు, వారు ఏ ఏ రైళ్లలో ప్రయాణించవచ్చనే అంశాలపై ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే పాస్ ల అంశం మరోమారు చర్చకు వచ్చింది. కాబట్టి దాని గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రైల్వే సర్వెంట్స్ (పాస్) రూల్స్-1986 ప్రకారం ఉద్యోగులకు రకరకాల పాస్లను జారీ చేస్తారు. వీటిలో ప్రివిలేజ్ పాస్, డ్యూటీ పాస్, పదవీ విరమణ తర్వాత ఇచ్చే కాంప్లిమెంటరీ పాస్లు చాలా కీలకమైనవి. అయితే ఈ పాస్ లను ఉపయోగించి.. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా నిబంధనలకు లోబడి నిర్దిష్ట రైళ్లలో ప్రయాణించే సదుపాయాన్ని పొందొచ్చు.
అయితే రైల్వే ఉద్యోగులు.. ఈ పాస్ లను ఉపయోగించి కొన్ని రైళ్లలో మాత్రమే ప్రయాణించే అవకాశముంది. వందే భారత్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ ప్రీమియం రైళ్లలోనూ ఈ పాస్ లు చెల్లుబాటు అవుతాయి. అయితే సదరు ఉద్యోగి ఏ తరగతిలో ప్రయాణించవచ్చనేది వారి హోదా, వేతన స్థాయి, అర్హత ఆధారంగా రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు.
Also Read: ‘భోగాపురం’ అంటే ఏంటీ? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఊరికి ఇంత చరిత్ర ఉందా?
ఇదిలా ఉంటే ఉద్యోగులకు ఇచ్చే రైల్వే పాస్ లు కొన్ని లగ్జరీ రైళ్లకు ఏమాత్రం వర్తించవు. విలాసవంతమైన, పర్యాటక ఆధారిత రైళ్లలో ఈ పాస్ చెల్లుబాటు కావని రైల్వే వర్గాలు చెబుతున్నారు. ‘మహారాజాస్ ఎక్స్ప్రెస్’, ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ తరహా ప్రత్యేక రైళ్లను ఐఆర్సీటీసీ (IRCTC), రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలు నిర్వహిస్తుంటాయి. వీటిలో రైల్వే ఉద్యోగులకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఉండవు. కాబట్టి ఉద్యోగులు కూడా సాధారణ ప్రయాణికుల మాదిరిగానే పూర్తి టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది.
Also Read: యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్లో లాంచ్!