ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు ప్రయాణాలలో పలు భారతీయ రైలు ప్రయాణాలు కూడా ఉన్నాయి. అబ్బుర పరిచే విసాలాతో అద్భుత యాత్రలు చేసే పలు రైళ్లను భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడిపిస్తుంది. అందులో మోస్ట్ పాపులర్ లగ్జరీ రైలు ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. దేశంలోని అత్యంత ప్రసిద్ధ ప్రయాణ అనుభవాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు రాజస్థాన్ రాజకుటుంబం, హైదరాబాద్ నిజాంలు, విశిష్ట అతిథుల కోసం రిజర్వు చేయబడిన ఈ రైలు.. ఆ తర్వాత ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (RTDC) భాగస్వామ్యంతో 1982లో ప్రవేశపెట్టబడిన ఈ రైలు.. విలాసవంతమైన ప్రయాణాలు అందిస్తుంది.
ఈ రైలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి, దేశంలోని అత్యంత ఆహ్లాదకరమైన గమ్యస్థానాల ద్వారా ముందుకు కదులుతుంది. 7 రాత్రులు, 8 పగళ్ల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ ప్రయాణం రాజస్థాన్ లో ముఖ్యమైన ప్రదేశాలు అన్నింటినీ కవర్ చేస్తుంది. జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్, ఉదయపూర్, చిత్తోర్ గఢ్, సవాయి మాధోపూర్, భరత్పూర్ తో పాటు తాజ్ మహల్, ఆగ్రా కోట వరకు కొనసాగుతుంది.
మార్గం మధ్యలో.. టూరిస్టులు సంస్కృతి, వన్యప్రాణులు, అడ్వెంచర్స్ లాంటి వాటిలో పాల్గొని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. జైపూర్ లోని అంబర్ కోటలో ఏనుగు సవారీ, రణతంబోర్ నేషనల్ పార్క్ లో జీప్ సఫారీ, చిత్తోర్గఢ్ కోటకు సన్ సెట్ సందర్శన, పిచోలా సరస్సుపై బోట్ ప్రయాణం, జైసల్మేర్లోని సామ్ సాండ్ డ్యూన్స్ మీదుగా ఒంటె సఫారీ ఉంటుంది. జోధ్ పూర్ లోని మెహ్రాన్ గఢ్ కోట, ఉమైద్ భవన్ ప్యాలెస్ ను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత భరత్ పూర్ లో పక్షులను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
రైలులోని 14 కోచ్ లలో ఒక్కోదానికి రాజస్థాన్ లోని ఒక్కో పాత రాజ్యం పేరు ఉంటుంది. అంతేకాదు, ఆయా క్యాబిన్ లు ఆ ప్రాంత వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించడి ఉంటాయి. పట్టు వస్త్రాలు, పురాతన శైలి ఫర్నిచర్, కళాత్మక టచ్ తో కూడిన క్యాబిన్లు చారిత్రాత్మక వైభవాన్ని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేస్తాయి. అన్ని క్యాబిన్లు ఎయిర్ కండిషన్ తో ఉంటాయి. ప్రైవేట్ బాత్రూమ్లు, ప్రీమియం టాయిలెట్లు, Wi-Fi, సేఫ్టీ లాకర్లు, టెలిఫోన్లు సహా బోలెడు సౌకర్యాలు ఉంటాయి. డే అండ్ నైట్ అతిథులకు సహాయకులు అందుబాటులో ఉంటాయి.
భోజనాలను అందంగా రూపొందించిన రెండు రెస్టారెంట్ కార్లలో వడ్డిస్తారు. స్వర్ణ మహల్ (ది మహారాజా), షీష్ మహల్ (ది మహారాణి) కోచ్ లలో భోజనాన్ని అందిస్తారు. ప్రయాణీకులు ఆన్ బోర్డ్ వంటగదిలో తాజాగా తయారుచేసిన వివిధ రకాల భారతీయ, అంతర్జాతీయ వంటకాలను ఆస్వాదించవచ్చు. ఇక ఈ విందులో మెనూలో సూప్లు, సలాడ్లు, ఇతర దేశ ప్రముఖ వంటకాలు, మటన్ రోగన్ జోష్, దాల్ మఖానీ, కంధారి పులావ్, గులాబ్ జామ్, ఐస్ క్రీం లాంటి డెజర్ట్ లు ఉంటాయి. ప్రతి భోజనంలో శాఖాహారం, మాంసాహారం ఉంటాయి.
ఇక ఈ రైళ్లో స్పా కారు కూడా ఉంటుంది. శిక్షణ పొందిన చికిత్సకులు అందించే ఆయుర్వేద మసాజ్లు, వెల్ నెస్ చికిత్సలను అందిస్తుంది. ప్రశాంతమైన ఇంటీరియర్లు, వృత్తిపరమైన సంరక్షణతో అత్యంత ఉత్తేజకరమైన విహారయాత్రను అందిస్తుంది.
ప్యాలెస్ ఆన్ వీల్స్ ఛార్జీలు సీజన్, ఆక్యుపెన్సీని బట్టి ఉంటాయి. వర్షాకాలంలో డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి సుమారు రూ. 5.56 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రత్యేక ప్రయాణాలకు అదనపు ఛార్జీలు ఉంటాయి.
Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?