కొన్ని చెడు అలవాట్లను ఎంత ప్రయత్నించినా వదల్లేం. ముఖ్యంగా మద్యపానం, సిగరెట్ స్మోకింగ్ వంటివి.. ఎన్నటికీ వీడలేని వ్యవసనాలు. దీన్ని కొందరు ఒక హోదాగా భావిస్తుంటారు. స్టైల్ అనుకుంటారు. చివరికి అవి లేకుండా బతకలేని స్థితికి వచ్చేస్తారు. అంతవరకు ఒకే కానీ, మరీ రైలు బస్సుల్లో కూడా దూమపానం చేస్తూ.. మద్యం తాగుతూ.. కామన్ సెన్స్ లేకుండా బతికేస్తున్నారు కొందరు. వారిలో ఈ ఇడియెట్ ఒకడు.
రైలు, బస్సుల్లో దూమపానం చేయకూడదు. మద్యం తాగకూడదు అని పెద్ద బోర్డులుంటాయి. వాటిని మనోళ్లు చాలా లైట్ తీసుకుంటారు. పక్కవారికి ఇబ్బందని తెలిసినా సరే.. అవన్నీ చేస్తారు. అలాంటి వారికి భారీ జరిమానాలే కాదు, జైలు శిక్ష విధించినా తప్పులేదు. తాజాగా ఓ ప్రయాణికులు రైలు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైలులో దర్జాగా సిగరెట్ తాగుతూ.. రింగులుగా పొగలు ఊదాడు. అంతే.. ఒక్కసారే అలజడి.
రైలులో ఉన్న స్మొక్ డిటెక్టర్ను ఇది గ్రహించి ఫైర్ అలారం మోగించింది. దీంతో రైల్లో అగ్నిప్రమాదం జరిగిందేమోనని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైలు నుంచి దూకేయడానికి సిద్ధమైపోయారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత రైల్లోని ఆటోమెటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా యాక్టీవేట్ అయ్యింది. దీంతో వేగంగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు రైలు దిగిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే, ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్ల మోగిన అలారం అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయాన్ని అదే రైలులో ప్రయాణిస్తున్న సుశాంత్ సింగ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ (X) ఖాతాలో పంచుకున్నాడు. ‘‘నేను ప్రయాణిస్తున్న రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడం వల్ల ఫైర్ అలారం మోగింది. ఆటోమెటిక్గా బ్రేకులు పడి రైలు ఆగిపోయింది. ఇలాంటివారి వల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అన్ని రైల్వే స్టేషన్ల ఎంట్రీ గేటుల వద్ద ప్రయాణికులను తప్పకుండా తనిఖీ చేయాలి’’ అని తెలిపాడు. పొగను గుర్తించగానే రైలును నిలిపేయడం హర్షనీయమని పేర్కొన్నాడు.
Also Read: 200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!
దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కొంతమంది ఎంత చెప్పినా మారరని, రైల్వే వ్యవస్థను ఎంత ఆధునీకరించినా.. ఇలాంటివారి వల్ల నష్టపోతున్నామని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇకపై ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించేవారిపై లైఫ్ టైమ్ బ్యాన్ విధించాలని, మళ్లీ రైలు ఎక్కకుండా చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రైలులో సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. చిన్న నిప్పు కూడా భారీ అగ్నిప్రమాదాలకు దారితీయొచ్చు. కాబట్టి.. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. రైలులో ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తే వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయండి.