మొన్ననే కవిత అన్నది కదా! బీఆరెస్ పార్టీ ఫండ్ కింద 1400 కోట్లు అక్రమ సొమ్ము ఉన్నదని. ఇవన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవేనని ఆమె ఆరోపించింది. ఇవన్నీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచాలని కూడా ఆమె డిమాండ్ చేసింది.
దీనిపై కేటీఆర్ తర్వాత స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు మమ్మల్ని ఉద్దేశించి కాదని, కాంగ్రెస్ పార్టీ ఫండ్ 3వేల కోట్లున్నాయి.. వాటిని పంచమనండి. అంటూ తప్పించుకోబోయాడు. కానీ ఇవాళ మంచిర్యాలకు చెందిన ఓ నాలుగు రైతు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున 20 లక్షలు పార్టీ ఫండ్ నుంచే పంపిణీ చేశారు. ఇదీ ఇప్పుడు డిస్కషన్ పాయింట్.
అవును.. ఇలా పార్టీ ఫండ్ను తెలంగాణలోని బాధిత కుటుంబాలకు పంచినా అవి తరగవు.. పార్టీకి మంచి పేరు వస్తుందనే విధంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయంగా ఇప్పుడు ఆ పార్టీకి అవసరమే కావచ్చు. కానీ తెలంగాణ కోసం.. కేసీఆర్ వెంట.. బీఆరెస్ పార్టీతో ఉండి సర్వం కోల్పోయిన వారెంతో మంది ఉన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న ఉద్యమకారులకు, పార్టీ క్యాడర్కు ఏం చేయలేకపోయారనే అసంతృప్తి, కోపం ఇంకా కేసీఆర్ పై ఉన్నాయి. ఈ విషయం స్వయంగా కేటీయారే పలు వేదికల మీద చెప్పుకున్నాడు. అప్పుడు వీరిని పట్టించుకోలేదని, ఆర్థికంగా వారంతా ఇబ్బంది పడ్డారని అన్నాడు. కానీ వారిని పార్టీ పరంగా ఆదుకుంటామని మాత్రం ప్రకటించలేదు.
మళ్లీ అధికారం వచ్చిన తరువాత వీరిని గతంలో లాగా గాలికి వదిలేయమని మాత్రం అన్నాడు. వీరిని ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెడతామని మాత్రం చెప్పాడు. కానీ .. కవిత ఎప్పుడైతే 1400 కోట్ల పార్టీ ఫండ్ అంశం బటయకు తీశారో.. అప్పట్నుంచి ఇది ఆపార్టీలో కూడా డిస్కషన్కు తావిస్తోంది.
ఇన్ని నిధులు పోగేసుకున్నది తెలంగాణ ఉద్యమం వల్ల, స్వరాష్ట్రం వచ్చిన తరువాత పదేళ్ల అధికారంతోనే కదా! మరి మనమంతా ఆ పార్టీకి అండగా ఉన్నాం.. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డాం.. మనకే మాత్రం ప్రయోజనం చేకూరింది..? అని తమను తాము ప్రశ్నించుకోవడమే కాదు.. ఉద్యమకారులు, కార్యకర్తలు కూడా దీనిపై విస్తృతంగా చర్చించుకునే పరిస్థితి కనిపించింది.
ఇవాళ మంచిర్యాలలో నలుగురు బాధిత రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున 20 లక్షలు పంపిణీ చేయడం కూడా ఆ పార్టీలో డిస్కషన్కు వచ్చింది. ఇలాంటి పనులు చేయడం వల్ల కాస్తోకూస్తో ఉన్న వ్యతిరేకత తగ్గుతుందనే భావన వచ్చింది.
అంతే కాదు.. ఆర్థికంగా ఇప్పటికీ చితికిపోయి ఉన్న ఉద్యమకారుల, పార్టీ కార్యకర్తలను కూడా కేటీఆర్, కేసీఆర్ ఈ విధంగానే పట్టించుకుని వారికి ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలనే వాదన తెరపైకి వస్తోంది.