Train Food Services: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు.. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే రైలులో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు మాత్రం ఆహారాన్ని వెంట తీసుకెళ్లడం లేదా రైలు క్యాటరింగ్లో ఫుడ్ ను కొనుగోలు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ప్రయాణికులకు ఉచితంగా అన్నదానం చేసే రైలు ఉందని మీకు తెలుసా? ఏసీ కోచ్ నుంచి జనరల్ వరకూ ప్రతీ ప్రయాణికుడికి వేడి వేడి ఆహారాన్ని మూడు పూటలా అందించే రైలు ఉందని ఊహించారా? అలాంటి రైలు విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సాచ్ఖండ్ ఎక్స్ప్రెస్’ ప్రయాణికుల ఆకలిని తీరుస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ రైలులో ప్రయాణించే వారికి ఉచితంగా ‘లంగర్’ (అన్నదానం) లభిస్తుంది. సాధారణ రైలు ప్రయాణాన్ని ఒక ఆధ్యాత్మిక, సామాజిక అనుభవంగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
సాచ్ఖండ్ ఎక్స్ప్రెస్ (నెం. 12715).. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి పంజాబ్లోని అమృత్సర్ మధ్య ప్రయాణిస్తుంది. సిక్కు సమాజానికి ఎంతో పవిత్రమైన రెండు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలను ఈ రైలు అనుసంధానిస్తుంది. సిక్కుల 10వ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ తన చివరి రోజులను గడిపిన ‘తఖ్త్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్’ నాందేడ్లో ఉండగా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘హర్మందిర్ సాహిబ్’ (గోల్డెన్ టెంపుల్) అమృత్సర్లో ఉంది. ఈ రెండు దివ్య క్షేత్రాలను కలిపే ప్రయాణం కావడం వల్ల.. భక్తులు దీనిని కేవలం ఒక రైలు ప్రయాణంగా కాకుండా ఒక పవిత్ర తీర్థయాత్రగా భావిస్తారు.
ఈ రైలులో ప్రయాణికులకు ఫ్రీగా ఆహారం (లంగర్) అందించే కార్యక్రమం.. తఖ్త్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ నివేదికల ప్రకారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రైల్వేల్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ.. ఈ అన్నదాన సేవ మాత్రం ఇందులో ఆగకపోవడం విశేషం. సిక్కు ధర్మ సూత్రాలకు ప్రతీకగా ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రయాణికులందరికీ ఒకే రకమైన ఆహారాన్ని అందించడం ద్వారా సమానత్వ భావనను ఈ రైలులో చాటిచెబుతున్నారు.
సాచ్ఖండ్ ఎక్స్ప్రెస్ దాదాపు 2,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణిస్తూ.. 33 గంటల వ్యవధిలో సుమారు 39 స్టేషన్లలో ఆగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో న్యూఢిల్లీ, భోపాల్, పర్భణి, జాల్నా, ఔరంగాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో లంగర్ ఏర్పాటు చేస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని వేడివేడిగా ఎంతో పరిశుభ్రంగా ప్రయాణికులకు అందిస్తారు. గురుద్వారాల మద్దతుతో స్వచ్ఛంద సేవకుల (సేవాదార్లు) సహకారంతో ఈ ప్రక్రియ అంతా చాలా క్రమశిక్షణతో జరుగుతోంది.
Also Read: ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!
ఈ రైలులో పెట్టే ఆహారం.. తేలిగ్గా అరిగేలా, పోషకాలతో కూడుకున్నది ఉంటుంది. పప్పు (దాల్), శనగల కూర, వేడివేడి కిచిడీ, బంగాళాదుంప, క్యాలీఫ్లవర్ తో చేసిన వంటకాలను ప్రయాణికులకు అందిస్తారు. జనరల్ కోచ్ ప్రయాణికుల నుండి ఏసీ బోగీల్లో ప్రయాణించే వారి వరకు అందరికీ ఒకే రకమైన ఆహారాన్ని వడ్డించడం ఈ సేవలోని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
Also Read: 24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!